పర్యాటకానికి చిరునామా ఏపీ!
ABN, First Publish Date - 2021-10-28T07:53:47+05:30
పర్యాటకానికి చిరునామా ఏపీ!
‘టూరిజం అంటే రాష్ట్రం’ అనేలా ప్రాజెక్టులు: సీఎం
7 నుంచి పాపికొండల విహారం.. టికెట్ 1,250
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో సీఎం జగన్ నిర్దేశం
ప్రాజెక్టులతో ఉపాధి పెరుగుతుందన్న అధికారులు
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): పర్యాటక రంగానికి రాష్ట్రం చిరునామాగా మారాలని సీఎం జగన్ నిర్దేశించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎ్సఐపీబీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో భారీ పర్యాటక ప్రాజెక్టులపై చర్చించారు. పలు ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో ప్రాజెక్టుపై కనీసం రూ.250 కోట్ల మేరకు పెట్టుబడులు వస్తాయని.. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ. 2,868.6 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఎస్ఐపీబీ వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా సుమారు 48 వేల మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘పర్యాటకం అంటే ప్రతి ఒక్కరూ ఏపీ వైపే చూడాలి. ప్రపంచ పర్యాటకులను సైతం ఆకర్షించేలా ప్రాజెక్టులు ఉండాలి. అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలి. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోండి’’ అని అధికారులను ఆదేశించారు. ఆధునిక వసతులు అందుబాటులోకి రావడం వల్ల పర్యాటక పరంగా రాష్ట్రస్థాయి పెరుగుతుందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యాటకంపై ఆధారపడేవారికి మెరుగైన అవకాశాలు వస్తాయన్నారు. విశాఖపట్నంలో ‘లండ న్ ఐ’ తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.
ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులు..
ఒబెరాయ్ విలాస్ బ్రాండ్ పేరుతో రిసార్టులకు ఆమోదం.
విశాఖ, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్, పిచ్చుకల లంకల్లో ఒబెరాయ్ రిసార్టుల నిర్మాణం.
విశాఖపట్నం శిల్పారామంలో హయత్ ఆధ్వర్యంలో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాలకు ఆమోదం.
తాజ్ వరుణ్ బీచ్ పేరుతో విశాఖలో మరో హోటల్, సర్వీసు అపార్ట్మెంట్ నిర్మాణాలు.
విశాఖపట్నంలో టన్నెల్ అక్వేరియం నిర్మాణానికి ఆమోదం.
విజయవాడలో హయత్ ప్యాలెస్ హోటల్ నిర్మాణానికి ఆమోదం.
అనంతపురం జిల్లా పెనుగొండలోని జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆథ్యాత్మిక పర్యాటక కేంద్రం నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం.
Updated Date - 2021-10-28T07:53:47+05:30 IST