పక్కదారి పడుతున్న ఎస్సీ, ఎస్టీ నిధులు
ABN, First Publish Date - 2020-11-22T11:21:34+05:30
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కేటాయించాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిలకమర్రి నర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ చిలకమర్రి నర్సింహ
భీమదేవరపల్లి, నవంబరు 21 : ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కేటాయించాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిలకమర్రి నర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని ముల్కనూర్ సహకార బ్యాంకులో సర్పంచ్ మాడ్గుల కొంరయ్య అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులపై నిర్వహించిన అవగాహన సదస్సులో నర్సింహ పాల్గొని మాట్లాడారు. రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తమ హక్కులను కాపాడుకునేలా ఎస్సీ, ఎస్టీలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.
జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్ మాట్లాడుతూ.. ఐనవోలు మండలంలో 124, 125 సర్వే నంబర్లలోని భూమిని ఇతరులకు పట్టా చేశారని ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆర్డీవో వాసుచంద్ర మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలపై వివక్ష రూపుమాపేలా ప్రతీ నెల గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏసీపీ రవీంద్ర కుమార్యాదవ్ మాట్లాడుతూ.. గడిచిన 14 నెలల్లో కాజీపేట ఏసీపీ పరిధిలో 20 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదయ్యాయని, వాటిపై విచారణ చేస్తున్నామన్నారు. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, వేలేరు మండలాల ఎంపీపీలు జక్కుల అనిత, మేకల స్వప్న, సమ్మిరెడ్డి, జడ్పీటీసీ వంగ రవీందర్, తహసీల్దార్ పోలం ఉమారాణి, ఎంపీడీవో భాస్కర్, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ జాతులు చైతన్యం కావాలి
వడ్డెపల్లి : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలను నిజం చేసుందుకు ఎస్సీ, ఎస్టీ జాతులు చైతన్యం కావాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిలకమర్రి నర్సింహ అన్నారు. శనివారం హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతి ప్రయోజనాల కోసం ఎస్సీ, ఎస్టీలు సంఘటితం కావాలని, రాజకీయ నాయకుల ఎత్తుగడలకు మోసపోవద్దన్నారు. ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులు పేదల అవసరాలను తీర్చాలని డిమాండ్ చేశారు. డీఎ్సడీడీ నిర్మల, ఏఎ్సడబ్ల్యూవో సత్యనారాయణ పాల్గొన్నారు.
Updated Date - 2020-11-22T11:21:34+05:30 IST