రైతులను మోసం చేస్తున్న కేసీఆర్
ABN, First Publish Date - 2020-11-13T10:02:03+05:30
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు.
సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలి
మాజీ ఎంపీ హనుమంతరావు
సుబేదారి, నవంబరు 12: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. ఈమేరకు సన్నరకం ధాన్యానికి మద్దతు ధర, భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని బాలసముద్రం ఏకశిలాపార్కు ఎదుట ధర్నా చేశారు. ముఖ్యఅతిథిగా హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం నియంత్రిత సాగు పేరుతో రైతులను సన్నాలను సాగుచేయమని ప్రోత్సహించి, ఇప్పుడు ఽధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తుండడం సరికాదన్నారు. ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు.
సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్ ఇచ్చి క్వింటాల్కు రూ. 2500 చొప్పున కొనుగోలు చేయాలన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏ కశిలా పార్కు నుంచి కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను సుబేదారి పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉత్తర జిల్లాల కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, పీసీసీ సభ్యులు ఈవీ.శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-13T10:02:03+05:30 IST