‘విదేశీ విద్య’కు వడ్డీ జలగలు
ABN, First Publish Date - 2020-12-15T05:45:04+05:30
‘విదేశీ విద్య’కు వడ్డీ జలగలు
వీసా కోసం నగదు నిల్వ పేరిట చీకటి వ్యాపారం
15 నుంచి 20 శాతం వరకు వడ్డీ వసూలు
బ్యాంకు ఓవర్డ్రా్ఫ్టతో దర్జా దందా
కోట్లకు పడగలెత్తిన ముగ్గురు వ్యాపారులు
నిద్ర నటిస్తున్న ఐటీ శాఖ అధికారులు
విద్యార్థి తండ్రి: ‘సార్ మాది నర్సంపేట... మా అబ్బాయికి యూకేలో సీటు వచ్చింది. రూ.30లక్షల బ్యాంకు డిపాజిట్ కావాలి.. మీ నెంబర్ మా బంధువొకరు ఇచ్చారు.’
వడ్డీ వ్యాపారి: ‘ఓకే. డిపాజిట్ చేస్తాం.. కానీ వెంటనే అందులో నుంచి లోన్ తీసుకుంటాం. కానీ మొత్తం డిపాజిట్కు మీరు వడ్డీ కట్టాల్సి ఉంటుంది.. అందుకు అవసరమైన అన్ని కాగితాలపై ముందే సంతకాలు తీసుకుంటాం.. ష్యూరిటీగా ప్రాపర్టీ డాక్యుమెంట్లు పెట్టాలి.’
విద్యార్థి తండ్రి: ‘సార్.. లోన్ తీసుకోగా మిగిలిన అమౌంట్కే వడ్డీ తీసుకోవాలి కదా..?’
వడ్డీ వ్యాపారి: ‘లెక్కలు అడగొద్దు.. మేం చేసే వ్యాపారమే అది..’
విద్యార్థి తండ్రి: ‘మీ లెక్క ప్రకారం చూస్తే మేం 20శాతం వరకు వడ్డీ కట్టాల్సి ఉంటుంది.. ఇది భారం కదా..?’
వడ్డీ వ్యాపారి: ‘మీకు ఇష్టముంటే తీసుకోవచ్చు.. లేదంటే లేదు.
ఇది విదేశీ విద్యకు వెళ్లే ఓ విద్యార్థి తండ్రికి, ఓ వడ్డీ వ్యాపారికి మధ్య వారం రోజుల క్రితం జరిగిన సంభాషణ. ఒక్క వరంగల్ రూరల్ జిల్లాయే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక మందికి ఎదురవుతున్న అనుభవం ఇది.
ఆంధ్రజ్యోతి, వరంగల్ రూరల్ : ‘విదేశీ విద్య’.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తుండగా, కొందరికి మాత్రం నోట్లు రాల్చే కల్పతరువుగా మారింది. విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థుల అవసరాలను ఆసరాగా చేసుకొని కొందరు వడ్డీ వ్యాపారులు అక్రమంగా కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ దందా వరంగల్ కేంద్రంగా గత కొన్నేళ్లుగా జోరుగా సాగుతోంది. కనీస లెక్కలు చూపకుండా, ఎటువంటి రికార్డులు రాయకుండా దర్జాగా వీరు జీరో దందా సాగిస్తుండడం విశేషం. అప్పు తీసుకున్నవారి నుంచి సాధారణంగా అధికవడ్డీ పేరిట 3 నుంచి 5 శాతం వరకు వసూలు చేస్తుంటారు. కానీ విదేశీ విద్య వీసా కోసం నగదు నిల్వ పేరిట డిపాజిట్ చేసి 15శాతం నుంచి 20శాతం వరకు వడ్డీలు వసూలు చేస్తుండటం నివ్వెరపరుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీరి వలలో చిక్కిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏటా వందలాది మంది విద్యార్థులు ఎం.ఎస్ చదివేందుకు విదేశాలకు వెళ్తుంటారు. ప్రధానంగా లండన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. జీఆర్ఈ, ఐఈఎల్టీఎస్ వంటి పరీక్షల్లో స్కోర్ ఆధారంగా విద్యార్థులు యూనివర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకుంటారు.
వీసా పొందడానికి యూనివర్సిటీలో అడ్మిషన్ పొందినట్టుగా కాస్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే తమ ఆర్థికవనరులను తెలిపే బ్యాంకు స్టేట్మెంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను యూనివర్సిటీలకు సమర్పించడంతో పాటు, వీసాలు పొందడానికి ఎంబసీ అధికారులకు చూపెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా విదేశాల్లో విద్యార్థులు ఎం.ఎస్. పూర్తిచేయడానికి రూ.40లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ ఖర్చును తాము సొంతంగా సమకూర్చుకుంటామనే హామీతో విద్యార్థులు అఫిడవిట్లు ఇస్తుంటారు. అడ్మిషన్లు ఇచ్చే విశ్వవిద్యాలయాలు విద్యార్థుల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్లను అడుగుతుంటాయి. వీసాలను జారీ చేసే ఎంబసీలు కూడా విద్యార్థులు చదువుకోవడానికే వెళ్లాలని, అక్కడ స్టూడెంట్ వీసాలతో పనిచేయకూడదని నిబంధనలు పెట్టాయి. ఎంబసీ అధికారులు విద్యార్థుల బ్యాంకు స్టేట్మెంట్లను నమ్మకుండా, ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయాల్లో బ్యాలెన్సులను చెక్ చేస్తుంటారు. వీసా రావాలంటే విద్యార్థులు రూ.30 లక్షల నుంచి రూ.40లక్షల వరకు తమ బ్యాంకు ఖాతాల్లో కనీసం నెలరోజులైనా చూపాల్సి ఉంటుంది. తమ బ్యాంకు ఖాతాల్లో లక్షల రూపాయల నగదు నిల్వను చూపే స్థోమత చాలా మంది కుటుంబాలకు ఉండదు. ఇక్కడే వడ్డీ జలగలు ఎంటరవుతారు. వరంగల్లోని ముగ్గురు అడ్తి వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ‘డిపాజిట్’ దందా సాగిస్తున్నారు. వీళ్లు ప్రత్యేక నెట్వర్క్ ద్వారా విదేశాలకు వెళ్లే విద్యార్థులను తమ వలలోకి లాగుతున్నారు.
దందా ఇలా...
విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థులకు అవసరమైన బ్యాంకు డిపాజిట్లను సమకూర్చి, ఎడాపెడా వడ్డీ వసూలు చేయడమే వీరి వ్యాపారం. వీళ్లు వసూలు చేసే వడ్డీ మామూలుగా ఉండదు, కళ్లు బైర్లుకమ్మేలా ఉంటుంది. అనేక జమానతులు, డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకొని అవసరమైన నగదును వీరు సంబంధిత విద్యార్థుల ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు. వీరికి అడ్తి వ్యాపారం పేరుతో బ్యాంకుల్లో ఖాతాలు ఉంటాయి. ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో బ్యాంకుల నుంచి అప్పు పొంది నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి ఎఫ్.డి.గా బదిలీ చేస్తుంటారు. విద్యార్థుల్లో ఖాతాల్లో ఎన్ని రోజులు డబ్బు ఉంచితే అన్ని రోజులకు వీళ్లు వడ్డీ వసూలు చేస్తారు. అయితే ఇక్కడే వీళ్లు అసలు మాయాజాలానికి తెరలేపుతారు. విద్యార్థుల ఖాతాల్లో తాము డిపాజిట్ చేసిన డబ్బుల నుంచి 80శాతం మేర విద్యార్థుల పేరిటే తిరిగి రుణంగా తీసుకుంటున్నారు. ఇందుకు అవసరమైన డాక్యుమెంట్లపై ముందే విద్యార్థుల సంతకాలు తీసుకొని బ్యాంకుల్లో పని కానిచ్చేస్తున్నారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి రూ.30లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత.. నాలుగైదు రోజులకే తిరిగి రుణం పేరిట రూ.25లక్షలు తీసుకుంటున్నారు. విద్యార్థి ఖాతాలో వాస్తవానికి ఉండే డబ్బు రూ.5లక్షలు మాత్రమే. కానీ విద్యార్థి నుంచి మాత్రం రూ.5లక్షలకు బదులు రూ.30లక్షలకు వడ్డీ వసూలు చేస్తున్నారు. అంటే నెలకు 15శాతం నుంచి 20శాతం వరకు వడ్డీ కింద దండుకుంటున్నట్టు లెక్క. ఒకరి పేరిట చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి తిరిగి రుణం తీసుకోవడం.. ఆ మెత్తాన్ని మరొకరికి డిపాజిట్ చేయడం, ఆ డిపాజిట్ నుంచి మళ్లీ రుణం తీసుకోవడం.. దానిని మరొకరికి డిపాజిట్ చేయడం.. చైన్ లింక్గా ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇలా వడ్డీల రూపంలో ముగ్గురు వ్యాపారులు రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. ఇదంతా జీరో దందా కావడం గమనార్హం.
దర్జాగా వ్యాపారం...
ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఫైనాన్స్ చేసే పేరిట ముగ్గురు వ్యక్తులు సాగిస్తున్న ఈ దందా బహిరంగ రహస్యంగానే కొనసాగుతోంది. తమను ఫోన్లలో సంప్రదించే వారికి తాము రెండున్నర శాతం వడ్డీ శాతం తీసుకుంటామని, మొత్తం డిపాజిట్ నుంచి లోన్ తీసుకుంటామని ముందుగానే చెబుతున్నారు. లోన్ అనేది తమకు సంబంధించిన అంశమని, తాము మొదట డిపాజిట్ చేసిన మొత్తానికే వడ్డీ కట్టాలని స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా ‘ఇదేం పద్ధతి...?’ అని ప్రశ్నిస్తే ఫైనాన్స్కు నిరాకరిస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో విద్యార్థుల కుటుంబాలు వడ్డీ చెల్లిస్తున్నాయి.
కన్సల్టెన్సీల సహకారం
వరంగల్ నగరంలో దాదాపు 15వరకు విదేశీ విద్య కన్సల్టెన్సీలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏటా వందలాది మంది విద్యార్థులు వీటి ద్వారా ఎం.ఎస్. చేయడానికి విదేశాలకు వెళ్తుంటారు. ఈ కన్సల్టెన్సీల నిర్వాహకుల్లో కొందరు వడ్డీ వ్యాపారస్తులతో కుమ్మక్కై విద్యార్థులను వారి వద్దకు పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కన్సల్టెన్సీల నిర్వాహకుల లోపాయికారి సహకారంతో వడ్డీవ్యాపారులు విద్యార్థుల కుటుంబాలను దోచుకుంటున్నారనే విమర్శలున్నారు. గత కొన్నేళ్లుగా విదేశీవిద్య వడ్డీ వ్యాపారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులు రూ.కోట్లకు పడగెత్తినట్టు సమాచారం.
నిద్రమత్తులో ఐటీ శాఖ అధికారులు
మాములుగా ఓ బ్యాంకు ఖాతాలో రెండు నుంచి పది లక్షల రూపాయల డిపాజిట్లు జమ అయితే చాలు ఖాతాదారుడికి ఐటీ నోటీసులు అందుతుంటాయి. ఎందుకోసం జమ అయ్యిందో, ఎలా వచ్చాయో చెప్పాలంటూ నోటీసులు ఇస్తారు. కానీ విదేశీవిద్య డిపాజిట్ల స్కామ్లో రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఏక మొత్తంలో మూడు బ్యాంకులకు సంబంధించిన బ్రాంచీల్లో ముగ్గురి కరెంట్ ఎకౌంట్ నుంచి జమ అవుతున్నా ఐటీశాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటోంది. అడ్తి, రైస్మిల్లు వ్యాపారం పేరిట బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్గా లక్షల రూపాయలను అనామకులకు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నా ఐటీ శాఖ కదలడం లేదు.
Updated Date - 2020-12-15T05:45:04+05:30 IST