45 నిమిషాల్లో బూడిద
ABN, First Publish Date - 2020-08-12T09:34:26+05:30
45 నిమిషాల్లో బూడిద
ఆధునిక పద్ధతిలో మృతదేహం దహనం
యంత్రం ఖరీదు రూ.46లక్షలు
కట్టెలతో రూ.8వేలు... దీనితో రూ.2వేలే
కరోనా నేపథ్యంలో ఏర్పాటు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఫొటో ల్లో కనిపిస్తున్నవి ఆధునిక దహన యంత్రం. 45నిమిషాల్లో మృతదేహాన్ని బూడిద చేసేస్తుంది. కరోనా నేపథ్యంలో వీటిని మరో రెండు, మూడు రోజుల్లో మహానగర పరిధిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే వీటి కోసం షెడ్ల నిర్మాణం జరుగుతోంది. ఒక్కో యంత్రం ధర రూ.46లక్షలు కాగా.. షెడ్డుతో కలిపి రూ.90లక్షల వరకు ఖర్చవుతోందని ఓ అధికారి చెప్పారు.
మున్ముందు ఇబ్బందుల దృష్ట్యా..
కరోనాతో మరణించిన వారిని ఇప్పటి వరకూ సనత్నగర్లోని ఈఎ్సఐ శ్మశానవాటికతోపాటు ఇతర ప్రాంతాల్లో దహనం చేస్తున్నారు. కొన్ని మృతదేహాలను ఖననం చేస్తున్నారు. అయితే, మృతదేహాల నుంచి వైరస్ సోకే అవకాశం లేదని చెబుతున్నప్పటికీ.. కొందరు కాటికాపరులు కరోనా బారిన పడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు దహనం చేయడానికి ఇబ్బందులు తప్పవని జీహెచ్ఎంసీ భావించింది. దీంతో అధునాత దహన యంత్రాల వైపు ఆలోచన చేసింది. వీటితో వైరస్ ముప్పు ఉండదని, ఖర్చు కూడా ఆదా అవుతుందని చెబుతోంది.
తక్కువ సమయం.. ఖర్చు ఆదా
విద్యుత్ దహన వాటికలను పునరుద్ధరించినా.. ఒక్కో మృతదేహం దహనం చేసేందుకు రెండున్నర నుంచి మూడు గంటల సమయం పడుతోంది. ఇప్పుడు కొత్త యంత్రంతో 45-55నిమిషాలే పడుతుంది. కట్టెలతో కాలిస్తే రూ.8-10వేలు అవుతుండగా.. దీనితో అయితే రూ.2వేల లోపే అవుతుందని అధికారులు చెబుతున్నారు. యంత్రం ఏర్పాటుకు ఇప్పటికే పటాన్చెరు సర్కిల్లోని ఓ శ్మశాన వాటికలో షెడ్డు నిర్మాణం పూర్తయింది.
ఇలా బూడిద..
మృతదేహాన్ని యంత్రంలోని పెట్టెలో పెట్టి.. ఆన్ చేస్తే.. 1400-1800 డిగ్రీల ఫారన్హీట్ ఉష్ణోగ్రత వెలువడుతుంది. దీంతో నిమిషాల్లోనే నిర్జీవ దేహం బూడిదగా మారుతుంది. యంత్రానికి ఇంధనంగా ఎల్పీజీ గ్యాస్ను వినియోగిస్తారు. డీజీల్తో కూడా పని చేస్తుంది. నగరంలోని నాలుగు విద్యుత్ దహన వాటికలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం రెండు రోజులుగా రెండు పని చేయడం లేదు. ఇప్పటి వరకూ ఒక్కోదానిలో 3-4 మృతదేహాలను దహనం చేస్తుండగా.. ఒక్కో అధునాతన యంత్రంతో 10-12 దహనం చేయవచ్చని చెబుతున్నారు.
Updated Date - 2020-08-12T09:34:26+05:30 IST