1.16 మీటర్లు పెరిగిన భూగర్భ జలమట్టం
ABN, First Publish Date - 2020-11-03T07:38:20+05:30
రాష్ట్రంలో 1.16 మీటర్ల మేర భూ గర్భ జలమట్టం పెరిగింది. అక్టోబరులో కురిసిన భారీ వర్షాలు ఇందుకు దోహదపడ్డాయి.
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 1.16 మీటర్ల మేర భూ గర్భ జలమట్టం పెరిగింది. అక్టోబరులో కురిసిన భారీ వర్షాలు ఇందుకు దోహదపడ్డాయి. గత నెల భూగర్భ జలమట్టం నివేదికను అధికారులు విడుదల చేశారు. దాని ప్రకారం.. ఈ సెప్టెంబరు(4.22 మీటర్లు)తో పోలిస్తే.. అక్టోబరులో భూగర్భ నీటి వనరులు 1.16 మీటర్ల మేర వృద్ధి చెంది.. 5.38 మీటర్లకు చేరుకున్నాయి.
ఈ ఏడాది అక్టోబరులోని భూగర్భ మట్టాలను గత పదేళ్ల (2010-19)భూగర్బ మట్టాలను సరాసరితో పోలిస్తే.. 543 మండలాల్లో పెరుగుదల, 46 మండలాల్లో తరుగుదల నమోదైంది. పెరుగుదల 0.05 మీటర్ల నుంచి 21.96 మీటర్ల వరకు ఉంది. తరుగుదల 0.03 మీటర్ల నుంచి 20.52 మీటర్ల వరకు ఉంది.
ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, సూర్యాపేట, జనగాంలో భారీగా.. కామారెడ్డి, యాదాద్రి-భువనగిరి, మహబూబ్నగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, గద్వాల, నాగర్కర్నూలులో ఓ మోస్తరు పెరుగుదల నమోదైంది.
Updated Date - 2020-11-03T07:38:20+05:30 IST