కుప్పకూలిన ఖిలాషాపూర్ కోట బురుజు
ABN, First Publish Date - 2020-10-16T07:29:28+05:30
చారిత్రకవీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న చరిత్రకు రుజువుగా నిలిచిన ఖిలాషాపూర్ కోట
వర్షాలకు దెబ్బతిన్న చారిత్రక కట్టడం
రఘునాథపల్లి,అక్టోబరు 15: చారిత్రకవీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న చరిత్రకు రుజువుగా నిలిచిన ఖిలాషాపూర్ కోట బురుజు గురువారం కుప్పకూలింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఈ కోట శతాబ్దాల నాటిది. కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ కోట బురుజులో కొంతభాగం బీటలు వారుతూ వస్తోంది. ఇది కూలిపోయే ప్రమాదముందని గ్రహించిన స్థానికులు ఆ చుట్టుపక్కల నివసించే వారిని ఇళ్లు ఖాళీ చేయించారు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగా గురువారం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో 3 ఇళ్లు ధ్వంసమయ్యాయి.
కోట మరమ్మతుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే బురుజు కూలిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మూడున్నర శతాబ్దాల ఈ చారిత్రక కట్టడాన్ని కాపాడాలని కోరుతున్నారు. కాగా, ఈ కోట అభివృద్ధికి ప్రభుత్వం మూడేళ్ల క్రితమే రూ.42 లక్షలు మంజూరు చేసింది. పనులు కూడా కొంతమేర పూర్తయ్యాయి. కాగా, సర్ధార్ సర్వాయి పాపన్న కోట బురుజు కూలినా బీసీ మం త్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం శోచనీయమని బీసీ సం క్షేమ సంఘం తెలంగాణ వర్కింగ్ప్రెసిడెంట్ దాసు సురేశ్ విమర్శించారు.
Updated Date - 2020-10-16T07:29:28+05:30 IST