మహా నగరం.. మహా సంద్రం!
ABN, First Publish Date - 2020-09-21T07:41:39+05:30
రాజధాని హైదరాబాద్.. మహానగరం! నిజమే. కానీ అది మామూలు సమయాల్లో!! వానపడితే.. మన భాగ్యనగరం ఒక మహాసముద్రం!! ఆ మహాసముద్రంలో ఏ నాలా ఎక్కడుందో
నగర రాదారులన్నీ గోదారులే!..
పేరుకే ‘గ్రేటర్’.. ఒక్క వానకే బేజారు
జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే దారి అత్యంత కీలకమైనది. కానీ.. వానపడితే మోకాటిలోతు నీళ్లతో నిండుకుండలా తొణికిసలాడుతుంటుంది! ఆ సమయంలో కిలోమీటరు దూరం ప్రయాణానికి గంట నుంచి రెండు గంటలు పడుతుంది!!
.. ఆ రెండు చోట్లే కాదు! ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, ఉప్పల్, కాప్రా, కూకట్పల్లి.. ఇలా ఏ ప్రాంతంలో చూసినా వర్షపు నీటితో రహదారులన్నీ గోదారులుగా మారిపోతున్నాయి. నగరవాసుల వాన ముంపు కష్టాలు అక్కడితో అయిపోలేదు. ఏళ్ల తరబడి మన్నికగా ఉండాల్సిన రోడ్లు.. వాన దెబ్బకు అడుగుకో గుంతగా మారుతాయి. దీంతో, గంటలతరబడి ట్రాఫిక్ జామ్! అంతేనా, మెట్రో రైలు ప్రాజెక్టు పైనుంచి వాననీళ్లు ధారగా పడుతూ ఉంటాయి. వెరసి, భాగ్యనగర రహదారుల దుస్థితిపై సామాన్యులు మండిపడుతున్నారు!!
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒక కీలకమైన సర్కిల్ రాజేంద్రనగర్. ఈ ప్రాంతంలోని శివరాంపల్లి నుంచి ఆరాంఘర్ వెళ్లే మార్గం. ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారి. ఈ దారిలో ఉన్న రామ్దేవ్ బాబా దేవాలయం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రహదారి చెరువును తలపించింది. వాహనాలు ముందుకు కదల్లేదు. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది.
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్.. మహానగరం! నిజమే. కానీ అది మామూలు సమయాల్లో!! వానపడితే.. మన భాగ్యనగరం ఒక మహాసముద్రం!! ఆ మహాసముద్రంలో ఏ నాలా ఎక్కడుందో తెలియదు. మూతల్లేని మ్యాన్హోల్స్ ఏ క్షణాన మింగేస్తాయో అంతకన్నా తెలియదు. రోడ్డు మీదకు వచ్చిన ప్రజలు క్షేమంగా ఇంటికి చేరితే అదృష్టం కిందే లెక్క. కార్లు సైతం మునిగిపోయేంతగా ప్రవహించే నీరు.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. భారీగా ఇంధన వ్యయం.. పనిగంటలు వృథా.. ఇదీ హైదరాబాద్. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అధ్వానంగా మారిన రోడ్లే ఇందుకు సాక్ష్యం.
మట్టి రోడ్లు నయం..
హైదరాబాద్ మహానగరానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు వస్తున్నాయి. పర్యాటక రంగంలో ప్రపంచంలోనే మంచి నగరంగా వారం రోజుల కిత్రమే గుర్తింపు వచ్చింది. అలాంటి గొప్ప నగరంలో రోడ్లు.. ఒక్క వానకే ‘మట్టి’గొట్టుకుపోతున్నాయి! కారణం.. హైదరాబాద్లోని రోడ్లలో సగానికంటే ఎక్కువ బీటీ రహదారులే. నీటి చుక్కకు, బీటీ రోడ్డుకున్న బద్ధ శత్రుత్వం అధికారులు, కాంట్రాక్టర్లకు వరంగా మారుతోంది. ఎప్పుడూ వేసవిలో వేసేరోడ్లు.. నాలుగు నెలలు గడవకముందే గుంతలమయంగా మారుతున్నాయి. అదేంటంటే వరద నీరు నిలిచిన చోట బీటీ ఉండదంటారు. వర్షం పడ్డాక ఆ రోడ్లను చూస్తుంటే.. వాటికంటే, పల్లెల్లో కనిపించే మట్టి రోడ్లే నయం అనిపిస్తుంది. వాన కురిసినప్పుడు ఆ గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
అంతేనా, రోడ్ల మీద గుంతల కారణంగా వాహనాలు నెమ్మదిగా వెళ్తుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోడ్ల నిర్వహణ విషయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు చెప్పే మాటలకు, వాస్తవ పరిస్థితులకు ఎంతో తేడా ఉంటోంది. విశ్వనగరంగా మారుస్తామని చెప్పే ప్రభుత్వం నగర రోడ్ల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను ఏమాత్రం పాటించడం లేదు. రోడ్ల కోసం నిధులను కేటాయించడం, వాటిని ఖర్చు చేయడంపై పెట్టే ఫోకస్, రోడ్ల నాణ్యతపై ఏమాత్రం పెట్టడం లేదని నగర వాసులు విమర్శిస్తున్నారు. రోడ్ల నిర్మాణం, రీ కార్పెటింగ్ పేరిట సగటున ఏటా రూ.300 కోట్లకుపైగా జీహెచ్ఎంసీ ఖర్చుచేస్తోంది. గత ఐదేళ్లలో రూ.1500 కోట్లకు పైగానే ఇలా రోడ్ల మరమ్మతు కోసం జీహెచ్ఎంసీ ఖర్చు చేయడం గమనార్హం. అయినా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో.. ఈ క్షణంలో బయటికెళ్లి ఏ రోడ్డును చూసినా అర్థమవుతుంది!!
రోడ్డు బాగున్నా.. నిర్మాణ లోపాలు
నాలుగు దశాబ్దాల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ మహా నగరానికి ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ లేదు. రోడ్లు వేసినా వాటిపై ఎన్నో నిర్మాణ లోపాలు! ఒకవైపు రోడ్డు ఎత్తు! మరోవైపు పల్లం! దాంతో, వర్షం వస్తే చాలు.. సగం రోడ్లంతా వర్షపు నీటి నిల్వే! ఉదాహరణకు.. మలక్ పేట నుంచి ఎల్బీ నగర్ వరకూ రోడ్డు బాగున్నా.. ఎక్కడ చూసినా నీటి నిల్వలే! మలక్పేట మెట్రో స్టేషన్ కింద ఒకవైపు ఎత్తు.. మరోవైపు పల్లం! దాంతో, అక్కడ భారీగా నీరు నిలిచిపోతోంది. అలాగే, జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే దారిలో మలేసియా టౌన్షిప్ దాటగానే వచ్చే ఫ్లై ఓవర్ దిగే చోట ఎడమవైపు నీరు భారీగా నిలిచిపోతుంది.ఈఎ్సఐ దాటి ఎర్రగడ్డ రైతుబజార్కు వెళ్లే దారిలో కూడా ఇదే పరిస్థితి. ఇలాంటివి నగరంలో చాలా చోట్ల ఉన్నాయి.
మెట్రో కారిడార్ నీళ్లన్నీ రోడ్లమీదనే...
మెట్రో ప్రాజెక్టుతోనూ రహదారులు దెబ్బతింటున్నాయి. మెట్రో కారిడార్లలో వయాడక్టులపై కురిసిన వర్షపు నీటినంతా ప్రధాన రహదారులపైకి వదిలేస్తున్నారు. అది కాస్తా.. వాహనదారులపైకి ధారగా కురుస్తోంది. అక్కడ రోడ్లు పాడవుతున్నాయి. రోడ్లపై నీటి నిల్వతో ట్రాఫిక్కూ ఇబ్బందికరంగా మారుతోంది. ప్రణాళికాబద్ధంగా వర్షపు నీరు నేరుగా నాలాల్లోకి వెళ్లేలా ఏర్పాటు చేయకుండా రోడ్ల మీదకు వదలడంతో ఒక్కసారిగా వర్షపు నీరు వచ్చి రోడ్లన్నీ నిండిపోవడంతో పాటు గుంతలమయంగా మారుతున్నాయి. అలా కాకుండా ఆ నీటిని.. డ్రైనేజీకి అనుసంధానం చేస్తే నీరు వెళ్లిపోతుంది. లేదా.. మెట్రో స్తంభాల నడుమ గ్రీనరీ కోసం మొక్కలు నాటారు. ఆయా ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే ఉభయతారకంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
రోడ్డే ఒక సముద్రం
వర్షం కురిస్తే చాలు.. చాలా రోడ్లపై నీళ్లు నిలిచిపోతున్నాయి. ఉదాహరణకు.. హైదరాబాద్లో అత్యంత ప్రధాన ప్రాంతాలుగా పరిగణించే అమీర్పేట మైత్రీవనం చౌరస్తా, కేసీపీ చౌరస్తా, పంజగుట్ట, రాజ్భవన్ రోడ్డు వంటి చోట్ల భారీ వర్షాలు కురిస్తే మోకాళ్ల లోతు నుంచి నడుం దాకా వర్షపు నీరు నిలిచిపోతుంది. ప్రధానమైన చౌరస్తాల్లోనే ఈ పరిస్థితి ఉందంటే ఇక మామూలు ప్రాంతాల దుస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. చెరువులు, నాలాలు, కుంటలను ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేపడుతుంటే అడ్డుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరించడమే ఈ సమస్యలన్నింటికీ కారణం.
కాలనీలన్నీ జలమయం
కొన్ని కాలనీలు, బస్తీల్లో అయితే భారీ వర్షం వస్తే ఇళ్లల్లోకే మోకాళ్లలోతు నీళ్లు వచ్చేస్తున్న దుస్థితి. కొన్ని కాలనీల నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం లేదు. దాంతో, రోడ్లకు గండి పెట్టి.. ఆ నీటిని మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంటోంది.
Updated Date - 2020-09-21T07:41:39+05:30 IST