అక్షరాస్యతలో కింది నుంచి 4వ స్థానంలో తెలంగాణ
ABN, First Publish Date - 2020-09-08T08:35:10+05:30
అక్షరాస్యతలో ఎప్పటిలాగానే కేరళ మరోసారి సత్తా చాటింది. 96.2 శాతం అక్షరాస్యతతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 66.4 శాతంతో
- టాప్-3లో కేరళ, ఢిల్లీ, ఉత్తరాఖండ్
- 66.4 శాతంతో అట్టడుగున ఆంధ్రప్రదేశ్
- నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ సర్వేలో వెల్లడి
- 2017-18 మధ్య సర్వే నిర్వహణ
కింద నుంచి రెండోస్థానంలో రాజస్థాన్ (69.7%), మూడోస్థానంలో బిహార్ (70.9%), నాలుగో స్థానంలో తెలంగాణ (72.8%), ఐదోస్థానంలో ఉత్తరప్రదేశ్ (73%), ఆరో స్థానంలో మధ్యప్రదేశ్ (73.7%) ఉన్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 7: అక్షరాస్యతలో ఎప్పటిలాగానే కేరళ మరోసారి సత్తా చాటింది. 96.2 శాతం అక్షరాస్యతతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 66.4 శాతంతో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో నిలవగా.. తెలంగాణ కింది నుంచి నాలుగో స్థానంలో ఉంది. ‘హౌస్హోల్డ్ సోషల్ కన్సంప్షన్: ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా’ అనే అంశంపై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ‘జాతీయ నమూనా సర్వే’ నిర్వహించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏడేళ్ల వయసు దాటిన వారిలో అక్షరాస్యత రేటుపై ఆ సర్వే ఆధారంగా ఒక నివేదికను సమర్పించింది. దాని ప్రకారం.. దేశంలో అక్షరాస్యత రేటు 77.7%. గ్రామీణ ప్రాంతాల్లో 73.5% ఉండగా.. పట్టణప్రాంతాల్లో 87.7% ఉండడం గమనార్హం.
అక్షరాస్యత రేటులో కేరళ అగ్రస్థానంలో నిలవగా.. 88.7 శాతం అక్షరాస్యతో ఢిల్లీ రెండోస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో వరుసగా ఉత్తరాఖండ్ (87.6%), హిమాచల్ప్రదేశ్(86.6%), అసోం (85.9%) ఉన్నాయి.
స్త్రీ, పురుషుల్లో అక్షరాస్యత విషయానికి వస్తే.. పురుషుల్లో అది 84.7 శాతంగా ఉండగా, మహిళల్లో 70.3 శాతం. ఇది జాతీయ సగటు. రాష్ట్రాలవారీగా చూసుకున్నా.. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కేరళలో అత్యధికంగా పురుషుల అక్షరాస్యత రేటు 97.4% ఉండగా.. స్త్రీలలో 95.2 శాతం ఉంది. ఏపీలో పురుషుల అక్షరాస్యత రేటు 73.4% ఉండగా.. మహిళల్లో 59.5% ఉంది.
సర్వే ఇలా..
2017 జూలై నుంచి 2018 జూన్ నడుమ దేశవ్యాప్తంగా 8097 గ్రామాల్లో 64,519 మందిని.. పట్టణప్రాంతాల్లో 49,238 మందిని ప్రశ్నించి ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న గ్రామీణప్రాంతాలవారిలో 4 శాతం మంది ఇళ్లల్లో, పట్టణప్రాంతాల వారిలో 23% మంది ఇళ్లల్లో కంప్యూటర్లు ఉన్నట్టు తేలింది.
Updated Date - 2020-09-08T08:35:10+05:30 IST