కరోనా విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్!
ABN, First Publish Date - 2020-08-09T00:34:03+05:30
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ విస్తరిస్తోంది.
హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసిన ఈ వైరస్తో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జాగ్రత్తలెన్ని తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..? తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. సామాన్య జనం, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. ఇలా అందరిపైనా దాడి చేస్తోంది. ఇలాంటి తరుణంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలకు ఒకింత శుభవార్త చెప్పారు.
సెప్టెంబర్ నాటికి కరోనా కనుమరుగు!
‘తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ధైర్యమే కరోనాకు మందు. సెప్టెంబరు ఆఖరు నాటికి తెలంగాణలో కరోనా పూర్తిస్థాయిలో కనుమరుగవుతుంది. ఈ నెలాఖరుకల్లా హైదరాబాద్లో కేసులు చాలా వరకు తగ్గుతాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. తెలంగాణలో పాజిటవ్ కేసులు నెమ్మదిగా తగ్గుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 5శాతం పాజిటివ్ రేటు నమోదవుతోంది. ప్రభుత్వం తాజాగా కరోనా నివారణ చర్యలకు రూ. 100 కోట్లు కేటాయించింది. కరోనా రెండు వారాలు మాత్రమే ఉండే జబ్బు. 11వందల సెంటర్స్లో రోజుకు 20వేలకు పైగా టెస్టులు చేస్తున్నాం. పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే హోం ఐసోలేషన్ కిట్ ఇస్తున్నాం. కోవిడ్ కేర్ సెంటర్స్ ద్వారా హోం ఐసోలేషన్ రోగులను మానిటరింగ్ చేస్తున్నాం’ అని శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు.
అందుబాటులో 10వేల బెడ్లు
‘ప్రస్తుతం 10వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయి. మెత్తం 18వేల పడకలకు ఆక్సిజన్ అందుబాటులో ఉంది. ఔట్ సోర్సింగ్ నర్సింగ్, డాక్టర్లను విధుల్లోకి తీసుకున్నాం. కొంతవరకే ప్లాస్మా ఉపయోగపడుతోంది. క్రిటికల్ రోగులకు ప్లాస్మాతో ప్రయోజనం ఉండదు. కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన వారిలో యాంటీబాడీస్ డెవలప్ కావు. పాజిటివ్ వచ్చిన వారు హైదరాబాదు రావాల్సిన అవసరం లేదు. జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పించాం’ అని డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) రమేష్ రెడ్డి తెలిపారు.
Updated Date - 2020-08-09T00:34:03+05:30 IST