పాలనా సౌధాలు.. కాలగర్భంలోకి
ABN, First Publish Date - 2020-07-08T08:27:52+05:30
పదహారు మంది ముఖ్యమంత్రుల పాలనా కేంద్రం.. లెక్కలేనంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎ్సల అధికార దర్పానికి నిలయం.. 25.5 ...
భారీ భద్రత మధ్య సచివాలయం కూల్చివేత మొదలు
రాత్రంతా దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించిన సీఎస్, డీజీపీ
సోమవారం అర్ధరాత్రి 12 దాటాక మొదలు
ముందుగా నల్లపోచమ్మ గుడిలో హోమం
అమ్మవారి మూలవిరాట్టు తరలింపు
మసీదులో పవిత్రగ్రంథాల అప్పగింత
స్టోన్ బిల్డింగ్, గుడి, మసీదు కూల్చివేత
సి-బ్లాక్ 15 శాతం.. జి-బ్లాక్ 50 శాతం
హెచ్-నార్త్, సౌత్ బ్లాకులు నేలమట్టం
సాయంత్రం డి-బ్లాక్ కూల్చివేత ప్రారంభం
సీఎం కేసీఆర్తో సీఎస్, డీజీపీ భేటీ
ఆయన అనుమతితో పనులు ప్రారంభం
భారీ బందోబస్తు, కిలోమీటరు దాకా ఆంక్షలు
వారం రోజులు కొనసాగనున్న కూల్చివేతలు
బీఆర్కే భవన్ ఉద్యోగులకు సెలవు
రోడ్లు, భవనాలశాఖ ఆధ్వర్యంలో కూల్చివేత
(హైదరాబాద్-ఆంధ్రజ్యోతి)
పదహారు మంది ముఖ్యమంత్రుల పాలనా కేంద్రం.. లెక్కలేనంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎ్సల అధికార దర్పానికి నిలయం.. 25.5 ఎకరాల్లో.. 9.16 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన పాత సచివాలయం.. పూర్తిగా కనుమరుగు కాబోతోంది! దశాబ్దాల చరితకు, ఎన్నో కీలక ఘట్టాలకు మౌనసాక్ష్యాలుగా నిలిచిన సచివాలయ భవనాలు ఒక్కొక్కటిగా నేలమట్టమవుతున్నాయి. ఆరో నిజాం నిర్మించిన అద్భుత సౌధం.. 132 ఏళ్ల ఘన చరిత్రగలిగిన భవనం.. డంగు సున్నంతో బకింగ్హామ్ ప్యాలెస్ రీతిలో యూరోపియన్ నిర్మాణ శైలిలో ఆకర్షణీయంగా, అర్ధచంద్రకార గుమ్మటాలతో నిర్మితమైన ‘సర్వహిత(జి-బ్లాక్)’ భవనం చరిత్రలో కలిసిపోతోంది. పాత సచివాలయ భవనాల కూల్చివేత పనులను ప్రభుత్వం మంగళవారం నుంచి ప్రారంభించింది. సచివాలయానికి వెళ్లే దారులన్నింటినీ మూసేసి.. భారీ బందోబస్తు నడుమ అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూల్చివేత పనులను మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో.. రహదారులు-భవనాల శాఖ సిబ్బంది ఈ పనులు చేపట్టారు. మొదట విద్యుత్తు శాఖ భవనమైన స్టోన్ బిల్డింగ్తో కూల్చివేతను ప్రారంభించి.. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే సి-బ్లాక్ కూల్చివేత పనులను కొనసాగించారు. 8 భారీ పొక్లెయిన్లు, జేసీబీలను ఇందుకు ఉపయోగిస్తున్నారు. స్టోన్ బిల్డింగ్, సి-బ్లాక్తో పాటు జి-బ్లాక్, హెచ్-నార్త్, సౌత్ బ్లాకుల కూల్చివేత పనులను మంగళవారం చేపట్టారు. నల్ల పోచమ్మ గుడి, మసీదును పూర్తిగా కూల్చివేశారు. సి-బ్లాక్ భవనాన్ని 15 శాతం మేర, పురాతన జి-బ్లాక్ భవనాన్ని 50 శాతం మేర కూల్చేశారు. హెచ్-బ్లాక్ నార్త్, సౌత్లను 20 శాతం చొప్పున కూల్చారు. పటిష్ఠంగా, అధునాతనంగా ఉన్న డి-బ్లాక్ కూల్చివేత పనులను సాయంత్రం ప్రారంభించారు. ఏపీకి అప్పగించిన జె, కె బ్లాకులు, తెలంగాణ ఆధీనంలోని ఎ, బి బ్లాకుల కూల్చివేతను ఇంకా ప్రారంభించలేదు. వీటిని బుధవారం కూల్చే అవకాశమున్నట్లు సమాచారం. కూల్చివేత నేపథ్యంలో సచివాలయం వైపు వచ్చే రహదారులను మూసేశారు. ఖైరతాబాద్, రవీంద్రబారతి, హిమాయత్నగర్, ట్యాంక్బండ్, తారామండల్ కాంప్లెక్ కూడళ్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. సచివాలయ ప్రాంగణానికి కిలో మీటరు వరకూ పోలీసులు ఆంక్షలు విధించారు. అటువైపు వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
పాత సచివాలయ భవనాల కూల్చివేతపై ఉన్న పిటిషన్లన్నింటినీ ఇటీవలే హైకోర్టు కొట్టేయడంతో.. పనుల ప్రారంభానికి ప్రభుత్వం నిర్ణయించింది. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి సోమవారం రాత్రి ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్హౌజ్కు వెళ్లారు. అక్కడే కూల్చివేతపై చర్చించారు.
ఘనమైన చరిత
ప్రభుత్వం కూల్చివేస్తున్న సచివాలయ భవనానికి ఘనమైన చరిత్ర ఉంది. 16 మంది ముఖ్యమంత్రులకు పాలనా కేంద్రమైన ఈ భవనంలోని బ్లాకుల గురించి..
అద్వితీయ కట్టడం జి-బ్లాక్: సచివాలయంలోని అతి పురాతమైన జి-బ్లాక్ భవనాన్ని ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ నిర్మించాడు. 1887లో నిర్మాణ పనులను ప్రారంభించి 1888లో పూర్తి చేయించాడు. ఇది లండన్లోని బకింగ్హామ్ ప్యాలె్సను పోలినట్లుగా, పూర్తి యూరోపియన్ నిర్మాణ శైలిలో ఉంటుంది. డంగు సున్నంతో కట్టినందున... ఎండా కాలంలోనూ చల్లగా ఉంటుంది. మహబూబ్ అలీ ఖాన్ ఇంటివద్ద నుంచే జీ-బ్లాక్ ద్వారా పాలనా యంత్రాంగాన్ని నడిపించారు. 132 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భవనం హెచ్ఎండీఏ పురాతన కట్టడాల జాబితాలో చోటు చేసుకుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సచివాలయంలోని బ్లాకులకు సమత, సర్వహిత వంటి పేర్లు పెట్టారు. ప్రజలందరి బాగోగులను కోరుకునేదిగా జి-బ్లాకుకు ఎన్టీఆర్ సర్వహిత అని పేరు పెట్టి ముఖ్యమంత్రి కార్యాలయంగా చేసుకుని పాలన సాగించారు. ఇది మంగళవారం నేలమట్టమైంది.
ఎ, బి, సి బ్లాకులు: సి-బ్లాక్కు కుడి వైపు ఉన్న ఎ, బి బ్లాకులు కూడా పటిష్ఠంగానే ఉన్నాయి. ఎ-బ్లాకును అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య 1981లో ప్రారంభించారు. బి-బ్లాక్ను 1998 ఆగస్టు 10న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. సి-బ్లాక్ను 1978లో ఆనాటి సీఎం చెన్నారెడ్డి ప్రారంభించారు. సి-బ్లాకులో మొత్తం 6 అంతస్తులున్నాయి. దీంట్లోనే ముఖ్యమంత్రులు కొలువుదీరేవారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత కాలం సి-బ్లాక్ నుంచే పాలన సాగించారు. ప్రగతి భవనాన్ని నిర్మించిన తర్వాత పాలనా కేంద్రాన్ని అక్కడికి మార్చారు.
డి-బ్లాక్: సచివాలయంలోని బ్లాకులన్నింటిలోకీ కొత్తడి డి-బ్లాకు. దీనిని అత్యంత అధునాతనంగా, పటిష్ఠంగా నిర్మించారు. తుమ్మల నాగేశ్వరరావు రోడ్లు-భవనాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దీని నిర్మాణాన్ని చేపట్టారు. ఈ భవన నిర్మాణ పనులకు 2003లో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయగా... 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎం అయ్యాక ప్రారంభించారు. ఇందులో 2.46 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది. ఇక, మొన్నటి వరకూ ఏపీ అధీనంలో ఉన్న జె, ఎల్ బ్లాక్లను అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 1990 నవంబర్ 12న ప్రారంభిచారు. జే బ్లాక్ సచివాలయంలోనే అతిపెద్ద బ్లాక్.
జగన్ సీఎం అయ్యాక..
రాష్ట్ర విభజనతో సచివాలయంలోని బ్లాకులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంచుకోవాల్సి వచ్చింది. పదేళ్ల పాటు(2024) రెండు రాష్ట్రాలు ఇక్కడి నుంచే పాలన సాగించేలా సచివాలయాన్ని విభజించారు. ఎ, బి, సి, డి బ్లాకులు తెలంగాణకు రాగా, హెచ్ నార్త్, సౌత్, జె, కె, ఎల్ బ్లాకులు ఆంధ్రప్రదేశ్కు వెళ్లాయి. ఏపీకి జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక... ఆ రాష్ట్ర ఆధీనంలోని నాలుగు బ్లాకులను తెలంగాణకు అప్పగించారు.
బీఆర్కే భవన్ ఉద్యోగులకు సెలవు
సచివాలయ కూల్చివేత నేపథ్యంలో బీఆర్కే భవన్లో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులకు ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. ఎవరూ విధులకు రావొద్దంటూ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయానికి కూతవేటు దూరంలోనే బీఆర్కే భవన్ ఉండడం, సచివాలయం వైపు వచ్చే దారుల్లోనే చాలా మంది ఉద్యోగులు అక్కడికి రావాల్సి ఉంటుంది. వారి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతాయని, పోలీసు బందోబస్తుకు ఆటంకాలు కలుగుతాయని భావించి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
హోమం చేసి.. ఆగమేఘాలపై..
భవనాల కూల్చివేత కార్యక్రమాన్ని ఆగమేఘాల మీద చేపట్టారు. రాత్రి 11 గంటలకు నల్ల పోచమ్మ గుడి వద్ద హోమం చేశారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్టును అక్కడి నుంచి తరలించారు. ముస్లిం మత పెద్దలను పిలిపించి మసీదులోని మత గ్రంథాలను అప్పగించారు. మసీదు కూల్చివేత గురించి వివరించారు. ఈ పనులన్నీ సీఎస్ పర్యవేక్షణలో సాగగా.. బందోబస్తు పనులను డీజీపీ చేపట్టారు. స్టోన్ బిల్డింగ్ను కూల్చిన తర్వాత వరుసగా మసీదు, సి-బ్లాక్ భవనం, నల్ల పోచమ్మ ఆలయం, జి-బ్లాకు, హెచ్ నార్త్, సౌత్ బ్లాకులను కూల్చేశారు. సీఎస్, డీజీపీ ఇద్దరూ సోమవారం రాత్రి 11 నుంచి మంగళవారం వేకువజామున 4 గంటల వరకు సచివాలయం వద్దే ఉన్నారు. అయితే, కూల్చివేత పనుల్లో జీహెచ్ఎంసీ జోక్యం లేకుండా సీఎస్ చూశారు. కేవలం రోడ్లు-భవనాల శాఖ సిబ్బందితోనే కూల్చివేత పనులను ప్రారంభింపజేశారు.
పక్కా ప్రణాళికతో..
సచివాలయ కూల్చివేతపై చాలాకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 50-60 ఏళ్ల వరకు పటిష్ఠంగా ఉండే డీ-బ్లాక్ వంటి భవనాలను కూల్చడం అంటే.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. హైకోర్టు తీర్పుతో కొత్త భవనాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. కానీ, ‘కరోనా కట్టడిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం సచివాలయాన్ని కూల్చివేస్తుందా?’ అనే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఆగమేఘాల మీద చేపట్టింది.
Updated Date - 2020-07-08T08:27:52+05:30 IST