ఉపాధికి ఊతం
ABN, First Publish Date - 2020-03-16T05:53:08+05:30
జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకంలో పని చేస్తున్న కూలీలకు ప్రభుత్వం వేసవి ప్రోత్సాహకాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటోంది.
ఉపాధి కూలీలకు వేసవి ప్రోత్సాహకం
ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అందజేత
అలవెన్స్తో కలిపి కూలి రూ.210
జిల్లాలో 1,76,805 మందికి ఊరట
పని ప్రదేశాల్లో టెంట్, తాగునీటి సౌకర్యం
పరిగి: జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకంలో పని చేస్తున్న కూలీలకు ప్రభుత్వం వేసవి ప్రోత్సాహకాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. మండె ఎండల్లో శ్రమించి పని చేస్తున్న కూలీలకు తగిన వేతనం దక్కడం లేదు. అధిక ఉష్ణోగత్రలకు భయపడి ప్రతి ఏటా వేసవిలో అధిక సంఖ్యలో కూలీలు పనులకు దూరం అవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉపాధి కూలీల కోసం వేసవి ప్రోత్సాహకాలు ప్రకటించింది. ప్రస్తుతం లభించే కూలికి అదనంగా ఆర్థిక చేయూతను అందించేందుకు సమ్మర్ అలవెన్స్ను అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అదనంగా కూలిని ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీని ద్వారా పనులు వేగవంతం కానున్నాయి.
అదే విధంగా కూలీలు పని చేసే చోట టెంట్, తాగునీరు, ప్రాథమిక చికిత్సకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం జిల్లాలో సగటు కూలి రూ.170 చెల్లిస్తున్నారు. వేసవి ప్రోత్సాహకంతో రూ.210లు చెల్లించనున్నారు. వలసల నివారణతో పాటు, ఉపాధి లేని వారికి పనిని కల్పించడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25శాతం, ఏప్రిల్, మేలలో 30 శాతం, జూన్లో 20 శాతం చొప్పున అదనంగా ప్రోత్సాహకం అందించనుంది. వీటితోపాటు, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
1,76,805 కార్డుదారులకు ఊరట..
జిల్లాలో ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో వేసవిలో వలసలను నివారించి ఉన్నచోటే పనులు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాలోని 18 మండలాల పరిధిలోని 565 గ్రామ పంచాయతీల్లో 1,76,805 జాబ్ కార్డులు ఉండగా, 4,05,488 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం పనులు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని 18 మండలాల్లో దాదాపుగా 40 వేల మంది కూలీలు పనుల్లో పాల్గొంటున్నారు. వేసవి అలవెన్స్పై విస్త్రత ప్రచారం చేసి కనీసం లక్షన్నరకుపైగా కూలీలు పనుల్లో పాల్గొనే విధంగా అధికారులు తీసుకోవాల్సి ఉంది.
సమ్మెలో ఫీల్ట్ అసిస్టెంట్ల..
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెబాట పట్టారు. జిల్లాలోని 565 గ్రామ పంచాయతీల్లో 367 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. వీరంతా గత మూడు రోజుల నుంచి డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా పంచాయతీ కార్యదర్శులకు వారి బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే పనిభారంతో కార్యదర్శులు ఆసక్తి చూపించడం లేదు. దీంతో క్షేత్రస్థాయిలో కూలీలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
Updated Date - 2020-03-16T05:53:08+05:30 IST