కరెంట్ కటకట
ABN, First Publish Date - 2020-05-27T10:01:19+05:30
భగభగ మండే ఎండలకు తోడు విద్యుత్ సమస్య వ్యవసాయానికి శాపంగా మారింది.
నీరు పుష్కలం.. వినియోగించుకోలేని దుస్థితి
విద్యుత్ కోతలతో
ఎండుతున్న పంటలు..
పూడూరు : భగభగ మండే ఎండలకు తోడు విద్యుత్ సమస్య వ్యవసాయానికి శాపంగా మారింది. కరెంటు కోతల కారణంగా చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెబుతుందే తప్ప.. క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. వ్యవసాయానికి కరెంట్ కనీసం పది గంటలపాటు కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. విద్యుత్ సరఫరాపై ఎన్నో ఆశలు పెట్టుకుని పంటలు సాగు చేస్తే నీరందక మాడుముఖం పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
పూడూరు మండలం రేగడిమామిడిపల్లి గ్రామాల్లో సాగు చేసిన పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. బోర్లు, బావుల్లో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ విద్యుత్ సమస్య కారణంగా పంటలకు నీరందడం లేదు. రేగడిమామిడిపల్లి గ్రామంలో కరెంట్ కోత కారణంగా రెండు వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్రనష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. బీట్రూట్, టమాట, ఇతర కూరగాయల పంటలు ఎండిపోతున్నాయి. ప్రస్తుతం కొత్తగా నాటిన విత్తనాలు కూడా మొలకెత్తక నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మెరుగైన విద్యుత్ను సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఆరు ఎకరాల పంట ఎండింది
గతేడాది ప్రభుత్వం 24గంటల కరెంట్ ఇవ్వడంతో 6 ఎకరాల్లో పంట సాగు చేశా. ఈ ఏడాది కూడా బీట్రూట్ సాగుచేశా. కరెంట్ సరిగా అందక పంట పూర్తిగా ఎండిపోయింది. రెండు ఎకరాలలో నీరు పూర్తిస్థాయిలో అందక విత్తనాలు భూమిలోనే మురిగి పోయాయి. ప్రభుత్వం వెంటనే 24గంటల కరెంట్ అందించి.. నష్టపోయిన పంటకు పరిహారం అందించాలి. - భూపతిరెడ్డి, రైతు, రేగడిమామిడిపల్లి
Updated Date - 2020-05-27T10:01:19+05:30 IST