ఓట్ల లెక్కింపు నేపధ్యంలో నగరంలో నిషేధాజ్ఞలు
ABN, First Publish Date - 2020-12-03T21:05:34+05:30
జీహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కాగా ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రేటర్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 4వ తేదీ ఉదయం 6గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6గంటల వరకు నిషేదాజ్ఞలు విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగానే రోడ్లపై ఎక్కువ మంది గుమిగూడడం, ఊరేగింపులను నిషేధించారు. ఎవరూ ఆయుధాలను కలిగి ఉండరాదు. చేతిలో కర్రలు, లాఠీలు, పేలుడు పదార్ధాలు, ఇతర ఆయుధాలు కలిగి ఉండరాదు.
అలాగే ఊరేగింపులు, గుంపులు గుంపులుగా పోగవడం, సమావేశాలు నిర్వహించడం వంటివి కూడా నిషేధించారు. తాత్కాలికంగా ఎక్కడా టెండ్లు వేయడం, స్టేజీలను ఏర్పాటు చేయరాదు. మైకులు ఏర్పాటుచేయడం, పబ్లిక్ లౌడ్ స్పీకర్లను ఉపయోగించరాదు. రాళ్లను కలిగి ఉండడం, తరలించం కూడా చేయరాదు. రోడ్లపైనా, కూడళ్లలో స్పీచులు ఇవ్వడం, ప్రదర్శనలు నిర్వహించడం, ప్లకార్డుల ప్రదర్శనలు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం వంటివి చేయరాదని పోలీస్కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పోలీసులు, మిలిటరీ, పారామిలిటరీ, హోమ్గార్డులు, ఎన్నికల సిబ్బందిని ఈ ఉత్తర్వుల నుంచి మినహాయించారు.
Updated Date - 2020-12-03T21:05:34+05:30 IST