ఉల్లి విత్తనం @ 4,000
ABN, First Publish Date - 2020-11-13T09:27:24+05:30
ఉల్లి రైతులకు విత్తన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కిలోకు రూ. 800 - రూ.1,000 మధ్యలో ఉండాల్సిన ఉల్లి విత్తన ధరలు.. ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగి రూ.
నాలుగు రెట్లు పెరిగిన ఉల్లి విత్తనం ధర
వచ్చే ఏడాది ఘాటెక్కనున్న ఉల్లి గడ్డలు!
ఖిల్లాఘణపురం విత్తనాలకు డిమాండ్
వనపర్తి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఉల్లి రైతులకు విత్తన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కిలోకు రూ. 800 - రూ.1,000 మధ్యలో ఉండాల్సిన ఉల్లి విత్తన ధరలు.. ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగి రూ. 4,000కు చేరుకున్నాయి. అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు తోడు.. పెరిగిన ఉల్లి ధరలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. శతాబ్దన్నర కాలంగా ఉల్లి విత్తనాల సాగుకు వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం ప్రసిద్ధి.
ఇక్కడి రైతులు సుమారు 200 ఎకరాల్లో ఉల్లి విత్తనాలను సాగు చేస్తారు. అందుకోసం సాధారణంగా ప్రజలు వాడే మేలురకం ఉల్లిని మించిన నాణ్యత ఉండే ఉల్లిగడ్డలను నాటుతారు. ఉల్లి పూత నుంచి విత్తన దశకు వచ్చాక.. వాటిని తీసి, ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తారు. 150 ఏళ్లుగా నాణ్యమైన విత్తనాలను అందజేస్తుండడంతో.. రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, నాగర్కర్నూలు, జోగులాంబ-గద్వాల, మహబూబ్నగర్, నిజామాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాలతోపాటు.. ఆంధ్రప్రదేశ్కు చెందిన రైతులు ఇక్కడి నుంచే విత్తనాలను కొనుగోలు చేస్తారు.
అమాంతం పెరిగిపోయిన పెట్టుబడి
ఈ సారి ఉల్లి ధరకు రెక్కలు రావడంతో.. ఉల్లి విత్తన రైతులకు పెట్టుబడి భారం పెరిగిపోయింది. గతంలో ఉల్లి విత్తన సాగుకు నాటే గడ్డల కొనుగోలుకు కిలోకు రూ. 10 - రూ. 15 దాకా వెచ్చించేవారు. ఈ సారి నాణ్యమైన ఉల్లిగడ్డలను కిలోకు రూ. 120 నుంచి రూ. 150 దాకా వెచ్చించి కొనుగోలు చేశారు. వాటిని నాటి.. ఉల్లి విత్తన సాగు చేశారు. అక్టోబరులో కురిసిన భారీ వర్షాలతో కొంత వరకు పంటలు దెబ్బతిన్నాయి.
ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. పెట్టుబడి, నష్టాలు పెరగడంతో.. ఈ సారి ఉల్లి విత్తన ధరలను కిలోకు రూ. 3,800 నుంచి రూ. 4,000గా నిర్ణయించారు. గత ఏడాది సరైన ధరలు లేక.. ఉల్లి సాగుకు దూరంగా ఉన్న రైతులు కూడా ఈ సారి సిద్ధమవుతుండడంతో విత్తనాలకు డిమాండ్ పెరిగింది. అయితే.. విత్తనాల ధరలు పెరగడం వల్ల.. ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందా? పంట చేతికొచ్చాక ధరలు ఇలాగే ఉంటాయా? లేక పడిపోతాయా? అనే ఆందోళన రైతుల్లో నెలకొంది.
ఉల్లి ఘాటెక్కనుందా?
ఉల్లి విత్తన ధరలు పెరిగిన నేపథ్యంలో.. వచ్చే సంవత్సరం ఉల్లి ధరలు ఘాటెక్కించే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఎకరా ఉల్లి సాగుకు 8 కిలోల విత్తనాలు అవసరం. కూలీల ఖర్చులు, కలుపుతీత, ఎరువులు.. ఇలా మొత్తం కలిపి ఎకరాకు రూ. 45 వేల దాకా పెట్టుబడి అవసరం. ఈ సారి విత్తనాల ధరలే నాలుగు రెట్లు అధికమవ్వడంతో, పెట్టుబడి భారం అమాంతం పెరిగిపోయింది
. అంతా సవ్యంగా సాగితే.. ఎకరాకు 60-70 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుంది. అంటే.. పంట చేతికొచ్చే సమయానికి క్వింటాకు రూ. 5,000 లోపు ధర ఉంటే.. రైతులకు నష్టమే. దీంతో.. పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధర దొరుకుతుందా? లేక వ్యాపారులు మాయాజాలం చేస్తారా? అనే ఆందోళన రైతుల్లో నెలకొంటోంది. సాధారణంగా ఉల్లి పంట చేతికొచ్చాక.. మార్కెట్లో వ్యాపారులు ధరలను అమాంతం తగ్గించేస్తారు.
కొన్ని సందర్భాల్లో కిలోకు రూ. 5 కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని కోల్డ్స్టోరేజీల్లో భద్రపరిచి.. ధరలను పెంచేస్తారు. వచ్చే ఏడాది అదే జరిగితే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ రైతులకు గిట్టుబాటు ధర దొరికితే.. మార్కెట్లో ధరలు మరింత పెరిగి, వినియోగదారుడికి భారం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉల్లిగడ్డ రేటు పెరగడం వల్లే
మేము నాణ్యమైన పంటను తీస్తాం. అందుకే డిమాండ్ ఎక్కువ. ఉల్లిగడ్డ ధరను బట్టి మేము విత్తనాల ధరను నిర్ణయించాల్సి ఉంటుంది. ఈసారి కరోనా ప్రభావం, అధికవర్షాలు, ఉల్లి రేటు పెరగడం వల్ల విత్తనాల ధర పెంచాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉల్లి విత్తనాలను కిలోకు రూ.3,800 నుంచి రూ.4,000కు విక్రయిస్తున్నాం.
- తిరుపతయ్య, రైతు, ఖిల్లాఘణపురం
Updated Date - 2020-11-13T09:27:24+05:30 IST