ఇంజనీరింగ్ విద్యార్థులకు నో క్రెడిట్స్.. నో డిటెన్షన్
ABN, First Publish Date - 2020-04-09T09:27:14+05:30
కరోనా కల్లోలంతో ఆందోళన చెందుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు జేఎన్టీయూ గొప్ప ఊరట ఇవ్వనున్నట్లు సమాచారం. మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక పరిస్థితులు నెలకొనడంతో ఆ ప్రభావం విద్యార్థులపై ఉండకుండా చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసిందిప. ఇందుకు సంబంధించి పరీక్షల నిర్వహణ, విద్యార్థుల ఉత్తీర్ణతపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది
ఈ ఒక్క విద్యాసంవత్సరానికి ఎత్తివేత
జూన్లో పరీక్షలు.. అప్పటిదాకా ఆన్లైన్ క్లాసులు
జూలైలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం
కరోనా నేపథ్యంలో జేఎన్టీయూ ఆలోచన
2లక్షల విద్యార్థులకు లబ్ధి.. ఇదే బాటలో ఓయూ?
హైదరాబాద్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): కరోనా కల్లోలంతో ఆందోళన చెందుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు జేఎన్టీయూ గొప్ప ఊరట ఇవ్వనున్నట్లు సమాచారం. మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక పరిస్థితులు నెలకొనడంతో ఆ ప్రభావం విద్యార్థులపై ఉండకుండా చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసిందిప. ఇందుకు సంబంధించి పరీక్షల నిర్వహణ, విద్యార్థుల ఉత్తీర్ణతపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఒక్క సెమిస్టర్కు డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అంటే పరీక్షలు రాసిన విద్యార్థులను క్రెడిట్స్తో సంబంధం లేకుండా పైతరగతులకు ప్రమోట్ చేస్తారు. ఈ మేరకు సోమవారం గవర్నర్ తమిళిసై నిర్వహించిన యూనివర్సిటీ రిజిస్ట్రార్ల వీడియో కాన్ఫరెన్స్లో జేఎన్టీయూ అధికారులు ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. దీన్ని అమలు చేస్తే జేఎన్టీయూ పరిధిలోని 151 కాలేజీల్లో ఉన్న సుమారు 2లక్షల మంది ఇంజనీరింగ్ ఫస్టియర్, సెకండియర్, థర్ట్ ఇయర్ విద్యార్థులకు ఊరట లభించనుంది. సాధారణంగా ఫస్టియర్ విద్యార్థులు సెకండియర్కు వెళ్లేందుకు, సెకండియర్ విద్యార్థులు థర్డ్ ఇయర్కు వెళ్లేందుకు, థర్డ్ ఇయర్ విద్యార్థులు ఫోర్త్ ఇయర్కు వెళ్లేందుకు అప్పటి వరకు వారు చదివిన సబ్జెక్టుల్లో కనీసం 50శాతం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఆ సబ్జెక్టులకు గల క్రెడిట్స్ను లెక్కించి పైతరగతులకు వేళ్లేందుకు అవసరమైన క్రెడిట్స్ సాధిస్తే వారిని ప్రమోట్ చేస్తారు. లేదంటే ఆ విద్యార్థులు పై తరగతులకు వెళ్లకుండా డిటెన్షన్కు గురవుతారు. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా విద్యార్థులకు సిలబస్ పూర్తి కాలేదు. విద్యార్థులు కూడా చదువుపై శ్రద్ధపెట్టే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇదే బాటలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా నడిచే అవకాశం ఉంది. కాగా లాక్డౌన్ నేపథ్యంలో జేఎన్టీయూ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. వీడియో లెక్చర్స్, స్కైపీ, జూమ్, జిట్సీమీట్, మూక్స్, స్వయం, ఎన్పీటెల్ వంటి ఫ్లాట్ఫామ్స్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. నూతన విద్యా సంవత్సరానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకకుంటున్నారు. ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన పరీక్షలను జూన్ నెలలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆ తర్వాత జులై రెండో వారంలో నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఫ్యాకల్టీని తీసేయొద్దు
కాలేజీల్లో ఫ్యాకల్టీని తొలగించడం గానీ, వారి వేతనాల్లో కోత పెట్టడం గానీ చేయోద్దని అనుబంధ కాలేజీలకు జేఎన్టీయూ ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే చాలా కాలేజీల యాజమాన్యాలు ఫ్యాకల్టీని తొలగించడంతో పాటు వేతనాల్లో కోత పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఈ విధమైన ఆదేశాలు చేశారు. ఉన్నపళంగా ఫ్యాకల్టీని తొలగించే కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బాలకిష్టారెడ్డి, సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు.
Updated Date - 2020-04-09T09:27:14+05:30 IST