ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి
ABN, First Publish Date - 2020-10-16T07:22:50+05:30
జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సుమారు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
కలెక్టర్ నారాయణరెడ్డి
నిజామాబాద్ అర్బన్, అక్టోబరు 15: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సుమారు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. గురువారం ప్రగతిభవన్లో 2020-21 సంవత్సరానికి గాను వర్షాకాలం వరి ధాన్యం కొనుగోళ్లపై సివిల్ సప్లై, వ్యవసాయ, సహకార, మెప్మా, రైస్మిల్లర్స్, ట్రేడర్స్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు లాభం చేకూర్చే విధంగా గ్రేడ్-ఎ రకం రూ.1885, సాధారణ రకం రూ.1868 మద్దతు ధర క్వింటాల్కు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ధర పొందేందుకు రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి చెత్త, తాలు, మట్టిపెళ్లలు, రాళ్లు లేకుండా తేమ 17 శాతం ఉండేలా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో, చెల్లింపులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేస్తున్నామన్నారు. రైతులు ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్, మొబైల్ నెంబర్ అందజేయాలన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద టార్ఫాలిన్, తేమ కొలత మీటర్లు రెడీగా ఉంచుకోవాలన్నారు. మొత్తం 445 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అవగాహన కల్పించే పోస్టర్లను, మొబైల్ యాప్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ధాన్యం సరఫరాకు వాహనాల ఇబ్బంది లేకుండా చూడాలని ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. నవంబర్ వరకు ఇంకా 45 రోజుల పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవోలు రవి, శ్రీనివాస్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-10-16T07:22:50+05:30 IST