బాసర ఆలయంలో అభివృద్ధి పనులకు మంత్రి ఇంద్రకరణ్ భూమి పూజ
ABN, First Publish Date - 2020-08-05T16:11:28+05:30
బాసర ఆలయంలో అభివృద్ధి పనులకు మంత్రి ఇంద్రకరణ్ భూమి పూజ
నిర్మల్: బాసర సరస్వతీ క్షేత్రంలో అభివృద్ధి పనులకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. తొలివిడతగా రూ.5.75 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వీఐపీ అతిధి గృహం ఆధునీకరణ, టీటీడీ ప్రక్క భవనం నుంచి వ్యాస మహర్షి గృహం వరకు షెడ్ నిర్మాణం, ఆలయ ప్రహారి గోడ, నది ఒడ్డున సూర్యేశ్వర ఆలయం వద్ద షెడ్ నిర్మాణ పనులకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్ధం కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. జ్ఞాన సరస్వతీ దేవిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతకుముందు మంత్రి జ్ఞాన అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
Updated Date - 2020-08-05T16:11:28+05:30 IST