బస్సులు, రైళ్లలో నేపాలీ ముఠా.. విమానంలో పోలీసుల చేజ్
ABN, First Publish Date - 2020-10-27T09:47:41+05:30
తక్కువ జీతానికే పనిచేస్తారు.. నేపాల్ దేశం కాబట్టి, తరచూ సెలవులు పెట్టబోమని నమ్మబలుకుతారు.. అదును చూసుకుని
ఐదుగురి అరెస్టు.. రూ. 7 లక్షల సొత్తు స్వాధీనం
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తక్కువ జీతానికే పనిచేస్తారు.. నేపాల్ దేశం కాబట్టి, తరచూ సెలవులు పెట్టబోమని నమ్మబలుకుతారు.. అదును చూసుకుని ఇంటిని గుల్ల చేస్తారు.. ఇదీ నేపాల్ ముఠా తీరు. పుణె కేంద్రంగా దోపిడీలకు పాల్పడుతున్న ఓ ముఠా నగరంలో చోరీకి పాల్పడి బస్సులు, రైళ్లలో నేపాల్కు పారిపోతుండగా.. రాచకొండ పోలీసులు విమానంలో చేజ్ చేశారు.
సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. నేపాల్కు చెందిన గోవింద్ బహదూర్ కొంతకాలం బెంగళూరులో సెక్యూరిటీ పనులు చేశాడు. ఆ సమయంలో.. లక్ష్మీనారాయణ సెక్యూరిటీ ఏజెన్సీతో అతనికి మంచి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పుణెకు మకాం మార్చాడు. నేపాలీ గ్యాంగ్ను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో తరచూ సెలవులు పెట్టే పనిమనుషులతో విసిగిపోయిన నాచారానికి చెందిన చింతపులుసు ప్రదీప్ కుమార్.. నేపాలీ పనివాళ్ల కోసం ఆరా తీయడం ప్రారంభించారు. లక్ష్మీనారాయణ ఏజెన్సీని సంప్రదించారు.
ఆ ఏజెన్సీ గోవింద్ను సంప్రదించగా.. అతడు తన ముఠా సభ్యులను రంగంలోకి దింపాడు. బెంగళూరులో ఉంటున్న మాయ అలియాస్ మంజూ, పుణెలో ఉండే తన అనుచరుడు అర్జున్ను రంగంలోకి దింపాడు. వారిద్దరినీ భార్యాభర్తలుగా పరిచయం చేసి, ఈ నెల 5న ప్రదీ్పకుమార్ ఇంట్లో పనికి కుదిర్చాడు. ఈ నెల 19న ప్రదీప్, అతని భార్య, పిల్లలు ఓ శుభకార్యానికి బయటకు వెళ్లగా.. ఇంట్లో ప్రదీప్ తల్లి లలితమ్మ మాత్రమే ఉంది. దీంతో.. అర్జున్, మాయ విషయాన్ని గోవింద్కు చెప్పి.. లలితమ్మకు నిద్రమాత్రలు కలిపిన టీ ఇచ్చారు. ఆమె నిద్రలోకి జారుకునే లోగా.. గోవింద్ ముఠా సభ్యులు రూ. 10 లక్షల నగదు, 18 తులాల బంగారం, 4 తులాల వెండి, ఇతర వస్తువులు కలిపి.. మొత్తం రూ. 20లక్షల సొత్తును దోచుకున్నారు. ఆ తర్వాత అంతా తలోదిక్కున రైళ్లు, బస్సుల్లో పారిపోయారు.
నేపాల్ సరిహద్దులో కలుసుకుని, దోచుకున్న సొత్తుతో తమ దేశానికి వెళ్లాలనేది వీరి ప్రణాళిక. నేపాల్ ముఠా ఆట కట్టించేందుకు సీపీ మహేశ్ భగవత్ స్వయంగా రంగంలోకి దిగారు. ముఠాను పట్టుకునేందుకు 15 బృందాలను రంగంలోకి దింపారు. పలు బృందాలు బస్సులు, రైళ్లలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ దాకా వెంబడించగా.. మరికొన్ని బృందాలు విమానాల్లో లఖ్నవూ, అక్కడి నుంచి నేపాల్ సరిహద్దుల్లో ఉంటూ.. నిందితుల కోసం కాపుకాచాయి. సీసీఎస్ ఇన్స్పెక్టర్ బాలూచౌహాన్ బృందం.. లఖ్నవూలో మాయ అలియాస్ మంజూను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ద్వారా సేకరించిన సమాచారంతో.. రాజేశ్ చెబీలాల్ సోనీ అలియాస్ జయ బహుదూర్ సునార్, హేమ ప్రసాద్, నిర్మల్ సౌద్, విస్నసునార్ను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 7 లక్షలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అర్జున్ సహా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. ఈ ముఠా అరెస్టులో కీలకంగా వ్యవహరించిన కీసర ఇన్స్పెక్టర్ నరేందర్, ఐటీసెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ మహేశ్, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ నవీన్, నాచారం ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్లకు సీపీ రివార్డులు అందజేశారు.
Updated Date - 2020-10-27T09:47:41+05:30 IST