ప్రతీ రైతుకు టోకెన్ : నల్లగొండ జిల్లా కలెక్టర్ పీజే.పాటిల్
ABN, First Publish Date - 2020-11-13T10:53:56+05:30
సన్నరకం వరిధాన్యం విక్రయానికి జారీచేస్తున్న టోకెన్ల కోసం రైతులు తొందరపడవద్దని, ప్రతి ఒక్కరికి వాటిని అందజేస్తామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.
నల్లగొండ టౌన్: సన్నరకం వరిధాన్యం విక్రయానికి జారీచేస్తున్న టోకెన్ల కోసం రైతులు తొందరపడవద్దని, ప్రతి ఒక్కరికి వాటిని అందజేస్తామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సన్న ధాన్యాన్ని మద్దతుధరకు కొనుగోలు చేస్తామన్నారు. టోకెన్ల జారీకి ఎలాంటి పరిమితిలేదని, రైతులకు వచ్చే రెండు నెలల వరకు వీటిని జారీ చేస్తామన్నారు. మిర్యాలగూడలో మిల్లుల సామర్ధ్యం ప్రకారం ప్రతి రోజు టోకెన్లు ఇస్తున్నామని, ఒకేసారి అందరికీ టోకెన్ ఇవ్వడం సాధ్యపడదన్నారు.
టోకెన్ తీసుకున్న రైతులు వరికోతకోసి ధాన్యం తీసుకురావాలన్నారు. సన్నరకాల్లో తేమశాతం తక్కువగా ఉంటే మిల్లర్లు కొనుగోలు చేయరనే అపోహచెందవద్దన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలని, 17 శాతానికి తక్కువ తేమ ఉన్నా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తారన్నారు. టోకెన్ల జారీతో మిల్లుల వద్ద ట్రాక్టర్ల రద్దీ తగ్గిందని, రైతులందరూ సహకరించాలని కోరారు.
Updated Date - 2020-11-13T10:53:56+05:30 IST