పాలసేకరణ ధర రూ.2పెంపు
ABN, First Publish Date - 2020-12-30T06:34:18+05:30
నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సహాయక యూనియన్ పాల సేకరణ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
జనవరి1 నుంచి అమలు
యాదాద్రి, డిసెంబరు29(ఆంధ్రజ్యోతి): నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సహాయక యూనియన్ పాల సేకరణ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి సేకరించే పాలకు లీటరుకు రూ.2 ధర అదనంగా పెంచారు. ప్రస్తుతం కనిష్ఠంగా వెన్న 5శాతం ఉన్న గేదెపా లు లీటరుకు రూ.30.20, గరిష్ఠంగా వెన్న 12శాతం ఉన్న పాలకు రూ.72.48, ఆవుపాలకు వెన్న 3శాతం ఉంటే కనిష్ఠంగా రూ.26.11, గరిష్ఠంగా వెన్న 4.5 శాతానికి రూ.29.51 చెల్లిస్తున్నారు. అయితే జనవరి 1వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమలుకానున్నాయి. దీని ప్రకారం లీటర్ గేదె పాలకు కనిష్ఠంగా రూ.32.20, గరిష్ఠంగా రూ.74.48, ఆవు పాలకు కనిష్ఠంగా రూ.28.11, గరిష్ఠంగా రూ.31.51 చెల్లించనున్నారు. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 36వేల మంది పాల ఉత్పత్తిదారుల నుంచి నిత్యం 70వేల లీటర్లను నార్మూల్ సేకరిస్తోంది. లీటర్కు సగటున రూ.2 పెరగడంతో పాడి రైతులకు రోజుకు రూ.1.40లక్షల ప్రయోజనం కలుగుతుందని నార్మూల్ అధికారులు తెలిపారు. పెరిగిన ధరలు జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని భువనగిరి పాలశీతలకరణ కేంద్రం మేనేజర్ జంధ్యాల రమేష్ కుమార్ తెలిపారు.
Updated Date - 2020-12-30T06:34:18+05:30 IST