బస్వాపూర్ ఇక.. నృసింహస్వామి రిజర్వాయర్
ABN, First Publish Date - 2020-08-07T06:55:32+05:30
కరువు జిల్లా యాదాద్రి భువనగిరికి సాగు, తాగునీటిని అందించడానికి చేపట్టిన బస్వాపూర్ రిజర్వాయర్ ఇక నృసింహస్వామి
యాదాద్రి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): కరువు జిల్లా యాదాద్రి భువనగిరికి సాగు, తాగునీటిని అందించడానికి చేపట్టిన బస్వాపూర్ రిజర్వాయర్ ఇక నృసింహస్వామి రిజర్వాయర్గా మారనుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసింది. యాదాద్రి ఆలయానికి కేవలం 8కి.మీల దూరంలో బస్వాపూర్ రిజర్వాయర్ ఇప్పటికే 1.50టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి అవసరమైన నిర్మాణ పనులు పూర్తిచేశారు. 1.35 లక్షల ఎకరాలకు గోదావరి జలాలను అందించే 11.39 టీఎంసీల సామర్ధ్యంతో ఈ జలాశయం నిర్మిస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యానికి అవసరమైన నిర్మాణంలో ఇప్పటివరకు 40శాతం పనులు పూర్తిచేశారు.
మొదటిదశగా మళ్లించే 1.50టీఎంసీల నీటి నిల్వలకు అనుగుణంగా 80శాతం పనులు పూర్తి చేసినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. మిగిలిన 20శాతం పనులు సైతం 15 రోజుల్లో పూర్తి చేసి నెలాఖరు వరకు నీటి నిల్వలకు సంసిద్ధం చేస్తామని పేర్కొంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోభాగంగా ఎగువ ప్రాంతంలో నిర్మించిన రంగనాయకుల సాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్కు నీటిని విడుదల చేసినందున దిగువన చివరి రిజర్వాయర్ అయిన బస్వాపూర్కు నీటి విడుదలకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ మేరకు తొలిదశలో కనీసం 1.50 టీఎంసీలను నింపడం కోసం పనులు వేగవంతం చేశారు.
Updated Date - 2020-08-07T06:55:32+05:30 IST