వాడకం కంటే వృథా ఎక్కువ
ABN, First Publish Date - 2020-12-11T08:54:51+05:30
కృష్ణా బేసిన్లో ఈ ఏడాది అరుదైన పరిస్థితి కనిపిస్తున్నది. ఈ ఏడాది మొదటి పంటలు పూర్తి కావడంతో పాటు, రెండో పంటను సాగు చేస్తున్న
ఇప్పటికే సముద్రంలో కలిసిన 1278 టీఎంసీల నీళ్లు.. ఉపయోగించిన నీరు 500 టీఎంసీల లోపే
ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు
కృష్ణా బేసిన్లో ఈ ఏడాది అరుదైన స్థితి
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్లో ఈ ఏడాది అరుదైన పరిస్థితి కనిపిస్తున్నది. ఈ ఏడాది మొదటి పంటలు పూర్తి కావడంతో పాటు, రెండో పంటను సాగు చేస్తున్న ప్రస్తుత సమయంలోనూ బేసిన్లోని అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇంకా పూర్తి స్థాయిలో ఉన్నాయి. అంతేకాక, ఈ సీజన్లో ఇప్పటి వరకు వినియోగించుకున్న నీటి కంటే సముద్రంలో కలిసిపోయిన నీరే ఎక్కువగా ఉంది. ఈ ఏడాది మొదటి నుంచి భారీ వర్షాలు కురియడంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో సీజన్ మొదల్లోనే ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండాయి. ఇంకా వరదలను కొనసాగడంతో ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేశారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు కృష్ణా బేసిన్లో సుమారు 1278 టీఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అయితే వినియోగించుకున్న నీరు మాత్రం 500 టీఎంసీల లోపే ఉంది. ఈ ఏడాది ఇప్పటికే మొదటి (వానాకాలం) పంటల సీజన్ ముగిసింది. ప్రస్తుతం రెండో పంటల సీజన్ ప్రారంభం అయింది.
రెండో పంట సీజన్ మొదలైన తర్వాత కూడా బేసిన్లోని ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల వంటి అన్ని ప్రాజెక్టుల్లో ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం మొదలయ్యే రెండో పంట అవసరాలను తీర్చిన తర్వాత వచ్చే ఏడాదికి కూడా కొంత నీరు నిల్వ ఉండే పరిస్థితి ఉంది. దాంతో వచ్చే ఏడాది వర్షాలు రావడం కొంత ఆలస్యం అయినా...ఖరీఫ్ సీజన్ పంటలకు ఇబ్బంది లేకుండా నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది.
నీటి వినియోగం ఇలా...
కాగా, ఈ ఏడాది సీజన్ మొదటి నుంచి మంచి వర్షాలు కురుస్తుండడంతో నీటి వాడకం పెద్దగా కనిపించడం లేదు. ఇప్పటి వరకు కృష్ణా బేసిన్లో ఏపీ 400 టీఎంసీలకు పైగా, తెలంగాణ ప్రభుత్వం సుమారు 90 టీఎంసీల నీటిని ఉపయోగించాయి. తెలంగాణ ప్రభుత్వం...కల్వకుర్తి పరిధిలో 7 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటి కోసం 9 టీఎంసీలు, ఏఎమ్మార్పీకి 14 టీఎంసీలు, సాగర్ ఆయకట్టుకు 31 టీఎంసీలు, ఆర్డీఎస్ పరిధిలో 3 టీఎంసీలు, జూరాల కింద 16 టీఎంసీలు, నెట్టెంపాడుకు 5.5 టీఎంసీలు, బీమా పరిధిలో 8 టిఎంసీలు, కోయిల్ సాగర్కు 1.29టీఎంసీలు నీటిని ఉపయోగించారు.
కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల్లో బుధవారం నాటి నీటి నిల్వల పరిస్థితి (టిఎంసీల్లో)
ప్రాజెక్టు పేరు పూర్తి ప్రస్తుత
సామర్థ్యం నీటి నిల్వ
ఆల్మట్టి 129.72 116.25
నారాయణపూర్ 37.64 35.38
ఉజ్జాయిని 117.24 117.24
జూరాల 9.66 9.44
తుంగభద్ర 100.86 81.32
శ్రీశైలం 215.81 191.21
నాగార్జునసాగర్ 312.05 306.10
పులిచింతల 45.77 45.56
త్వరలో త్రిమెన్ కమిటీ సమావేశం
ఇరు రాష్ట్రాలకు యాసంగి అవసరాలకు నీటిని కేటాయించడం కోసం త్రిమెన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఈ సమావేశాన్ని నిర్వహించే తేదీని ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. రాబోయే అవసరాల కోసం తమకు 86 టీఎంసీల నీటిని కేటాయించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు ఇండెంట్ సమర్పించింది.
అలాగే తమకు 156 టీఎంసీల నీటి ని కేటాయించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం కోరినట్టు సమాచారం. రాష్ట్రాల వినతి మేరకు త్వరలోనే త్రిమెన్ కమిటీ సమావేశమై, ఇరు రాష్ట్రాలకు నీటిని కేటాయించాలని బోర్డు యోచిస్తున్నది.
Updated Date - 2020-12-11T08:54:51+05:30 IST