తెలంగాణ విమోచనోద్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర
ABN, First Publish Date - 2020-09-27T20:10:24+05:30
తెలంగాణ విమోచనోద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని గ్రామీణాభివృద్ది, పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
రాయపర్తి: తెలంగాణ విమోచనోద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని గ్రామీణాభివృద్ది, పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బాపూజీ జయంతి సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి రాయపర్తిలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయనకు పుష్పాంజలి ఘటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో 1915, సెప్టెంబరు 27లో పుట్టిన బాపూజీ తెలంగాణ స్వాతంత్య్రం కోసం పోరాడి ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారని అన్నారు. ఆయన మూడేళ్ల వయస్సున్నప్పుడే బాపూజీ తల్లి చనిపోయింది. హైదరాబాద్లో లా పూర్తిచేసిన ఆయన 1940లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారి తరపున కేసులు వాదించి గెలిపించే వారని చెప్పారు.
1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలోనూ బాపూజీ కీలంగా పనిచేశారని గుర్తుచేశారు. ఆనాడు అజ్ఞాతంలో ఉండి ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. 1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాద్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారని అన్నారు. తిరిగి 1967లో భువనగిరి నుంచి పోటీచేసి మరోసారి విజయం సాధించినట్టు తెలిపారు.
కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో కేబినెట్ మంత్రిగాపనిచేస్తూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తన పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చే వరకూ తాను రాజకీయ పదవులు చేపట్టబోనని భీషణ ప్రతిజ్ఞ చేసిన నేత కొండా లక్ష్మణ్బాపూజీ అని పేర్కొన్నారు. ఆ జన్మాంతం అదే మాట మీద ఉన్న మహనీయుడని అభివర్ణించారు.
Updated Date - 2020-09-27T20:10:24+05:30 IST