చర్చ లేకుండానే..శ్రీ
ABN, First Publish Date - 2020-09-06T10:03:10+05:30
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చర్చ లేకుండానే ముగిసింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జ్జీ, దుబ్బాక ఎమ్మెల్యే ..
మొక్కుబడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జి, ఎమ్మెల్యే రామలింగారెడ్డికి నివాళులు
వారి సేవలను గుర్తు చేసుకున్న చైర్పర్సన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్
మెదక్ రూరల్, సెప్టెంబరు 5: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చర్చ లేకుండానే ముగిసింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జ్జీ, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతికి సంతాపం తెలపడానికే పరిమితమైంది. మెదక్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్షరెడ్డి, ఇన్చార్జి కలెక్టర్ వెంకట్రామారెడ్డితో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి నివాళులర్పించి, మౌనం పాటించారు.
అనంతరం జడ్పీ చైర్పర్సన్ హేమలతాగౌడ్ మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ మృతి దేశానికి తీరని లోటని అన్నారు. దేశం బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నాయకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన కృషిని ప్రజలు ఎన్నటికీ మరువరని కొనియాడారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి దిగ్ర్భాంతిని కలిగించిందన్నారు. నిరంతరం ప్రజల కోసమే తపించే నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
పదవులకే వన్నె తెచ్చారు..
అనంతరం ఎమ్మెల్సీ శేరి సుభా్షరెడ్డి మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఏ పదవిని అఽధిష్ఠించినా.. ఆ పదవికే వన్నె తెచ్చారని కొనియాడారు. ఐదు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఆయన తన అనుభవం, సమర్థతతో ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆయన చేసిన కృషితో రాష్ట్ర ప్రజల మనసుల్లో నిలిచిపోతారని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి దుబ్బాక ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు.
ప్రణబ్ ముఖర్జీ సేవలు మరువలేనవి
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి పణ్రబ్ముఖర్జి దేశానికి చేసిన సేవలు మరవలేనివన్నారు. ఆయన స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి దేశ అత్యున్నత స్థానానికి ఎదిగారని స్పష్టం చేశారు. దేశానికి ఆయన చేసిన సేవలకు భారతరత్న అందుకున్నారని గుర్తు చేశారు. తాను డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు రాష్ట్రపతిగా శీతాకాల విడిదికి హైదరబాద్కు వచ్చిన సందర్భంగా ఆయనను కలిసి మాట్లాడే అవకాశం తనకు దక్కిందన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి 2003 నుంచి తనకు తెలుసన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఉత్సాహంగా పనిచేశారన్నారు. ఎమ్మెల్యేగా ఆయన దుబ్బాక అభివృద్ధికి జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. అన్నా అని తాను ఆప్యాయంగా పిలిచే రామలింగారెడ్డి మృతి తనను ఎంతగానో బాధించిందన్నారు.
దేశానికే గౌరవం
ఇన్చార్జి కలెక్టర్ వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రపతిగా ప్రణబ్ముఖర్జీ సేవలు దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చాయని పేర్కొన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయనను ప్రభుత్వం భారతరత్నతో గౌరవించిందన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి రామలింగారెడ్డి నిరంతరం తపించేవారని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2020-09-06T10:03:10+05:30 IST