దొంగతనం కేసు పెడతారనే భయంతో వ్యక్తి ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-12-11T05:55:15+05:30
కల్హేర్, డిసెంబరు 10 : దొంగతనం కేసు తన మీద పడుతుందని భయపడిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కల్హేర్ మండలంలోని బాచేపల్లిలో గురువారం జరిగింది.
బాచేపల్లిలో ఘటన, పోలీసులను నిలదీసిన గ్రామస్థులు
కల్హేర్, డిసెంబరు 10 : దొంగతనం కేసు తన మీద పడుతుందని భయపడిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కల్హేర్ మండలంలోని బాచేపల్లిలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన గంజాయి హన్మండ్లు (40) అనే వ్యక్తితో పాటు మరో నలుగురిని గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసు విచారణకు కోసం బుధవారం పోలీ్సస్టేషన్కు తీసుకెళ్లారు. విచారణ అనంతరం గురువారం ఉదయం తిరిగి రావాలని పోలీసులు హెచ్చరించి పంపించారు. దీంతో హన్మండ్లు అవమానంతో పాటు దొంగతనం కేసు తన మీద నమోదవుతుందన్న భయంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న కల్హేర్ పోలీసులు, కంగ్టి సీఐ, సిబ్బంది బాచేపల్లికి చేరుకున్నారు. అప్పటికే పోలీసుల మీద ఆగ్రహంతో ఉన్న గ్రామస్థులు వారిని నిలదీశారు. డబ్బులు తీసుకుని హన్మండ్లును దొంగతనం నేరం ఒప్పుకోవాలని పోలీ్సస్టేషన్లో హింసించారని ఆరోపించారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ దొంగతనం కేసులో హన్మండ్లును కేవలం అనుమానం మేరకే తీసుకెళ్లి విచారించి వదిలిపెట్టామన్నారు. అయితే గ్రామంలోని సీసీ కెమెరాల్లో హన్మండ్లు అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించడంతోనే తీసుకెళ్లామని, అతనిపై ఎలాంటి కేసూ నమోదు చేయలేదని గ్రామస్థులను సముదాయించే ప్రయత్నం చేసినా.. వారు శాంతించలేదు. హన్మండ్లు మృతదేహాన్ని దొంగతనం జరిగిన వ్యక్తి ఇంట్లోనే వేస్తామని ఆందోళనకు దిగారు. పోలీసులు, గ్రామ పెద్దలు దొంగతనం జరిగిన వ్యక్తి వద్ద పరిహారం ఇప్పించేందుకు ఒప్పందం చేసుకోవడంతో గ్రామస్థులు శాంతించారు. అనంతరం కుటుంబసభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2020-12-11T05:55:15+05:30 IST