నేడే ఉప సమరం
ABN, First Publish Date - 2020-11-03T11:12:07+05:30
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమని, మంగళవారం జరగనున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్లో నిర్భయంగా ఓటేయాలని సిద్దిపేట కలెక్టర్ భారతీ హోలికేరి పిలుపునిచ్చారు
ఉప ఎన్నిక పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు
కరోనా నేపథ్యంలో ఓటర్ల రక్షణకు జాగ్రత్తలు
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్
దుబ్బాక ఉప సమరం తుది అంకానికి చేరుకున్నది. ఓటరు మహాశయులు నేడు తమ తీర్పుతో ఎవరిని విజయ తీరాలకు చేరుస్తారో నిర్ణయించనున్నారు. ఎన్నిక రణరంగంలో హోరాహోరీగా తలపడిన ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటరీ కేంద్రం నుంచి ఏడు మండలాల్లోని 315 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, వీవీప్యాట్లతో ప్రత్యేక వాహనాల్లో సోమవారం సిబ్బందిని తరలించారు. కొవిడ్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను శానిటైజ్ చేశారు. ఓటర్లు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిద్దిపేట సీపీ ఆధ్వర్యంలో నలుగురు ఏసీపీలు, పది మంది డీఎస్పీలు, 54 మంది సీఐలు, ఎస్ఐలతో పాటు మొత్తం 2000 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 వరకు కొనసాగనుంది.
నిర్భయంగా ఓటేయాలి..సిద్దిపేట కలెక్టర్ భారతీహోలికేరి
దుబ్బాక, నవంబరు 2 : భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమని, మంగళవారం జరగనున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్లో నిర్భయంగా ఓటేయాలని సిద్దిపేట కలెక్టర్ భారతీ హోలికేరి పిలుపునిచ్చారు. సోమవారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటరీ కేంద్రంలో ఎన్నికల సామగ్రి పంపిణీని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికలో ఎలాంటి అవాంతరాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. స్వేచ్ఛాయుత వాతవరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఓటరు స్లిప్ గుర్తింపు ప్రామాణికం కాదని, కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డులను ప్రతీ ఓటరు తప్పనిసరిగా తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎపిక్ కార్డులేని ఓటర్లు వారి గుర్తింపును నిరూపించుకోవడం కోసం భారత్ ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల ఫొటోలతో కూడిన ఏదేని ప్రత్యామ్నాయ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డు లివే
1) పాస్పోర్టు 2) డ్రైవింగ్ లైసెన్స్
3) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి ఫొటో గుర్తింపు కార్డు
4) బ్యాంకు, పోస్టాపీసు ఫొటోతో సహా జారీ చేసిన పాస్పుస్తకాలు
5) పాన్ కార్డు
6) ఎన్పీఆర్ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు
7) ఎంజీఎన్ఆర్ఎజీఏ జారీ చేసిన ఉపాధి హామీ పత్రం
8) ఆరోగ్య బీమా కింద కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్మార్ట్కార్డు
9) ఫొటో జత చేసిన పింఛన్ పత్రం
10) ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం
11) ఆధార్ కార్డు
ఇవి తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందని కలెక్టర్ భారతీ హోలీకేరి తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ఎన్నికల ఫలితాల ప్రకటన నిషేధం..ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోలికేరి
సిద్దిపేట అగ్రికల్చర్ : మంగళవారం జరగనున్న దుబ్బాక ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్తో పాటు, ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడం, వ్యాప్తి చేయడంపై చట్ట ప్రకారం ఆంక్షలున్నాయని, వాటిని కచ్ఛితంగా పాటించాలని కలెక్టర్ భారతి హోలికేరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951కి సంబంధించిన సెక్షన్ 126 ఏలోని సబ్సెక్షన్(1),(2) కింద సంక్రమించిన అధికారాలను వినియోగించి భారత ఎన్నికల కమిషన్(ఈసీ) నవంబరు 3న ఉదయం 6 గంటల నుంచి 7న సాయంత్రం 6.30 వరకు ఈ ఆంక్షల్ని విధించారని ఆమె తెలిపారు. ఈ మధ్య కాలంలో ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియాల్లో ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణ లేదా సమాచారం వ్యాప్తి చేయకూడదని, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ప్రకటించ కూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. వీటిని అతిక్రమించిన వారిపై భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చట్టపరమైన చర్యలను తీసుకుంటామని కలెక్టర్ భారతి హోలికేరి హెచ్చరించారు.
లక్ష్మాపూర్ పోలింగ్ కేంద్రం ఏటిగడ్డ కిష్టాపూర్లో ఏర్పాటు..ఓటర్ల కోసం ప్రత్యేక బస్సులు
గజ్వేల్: తొగుట మండలం మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన లక్ష్మాపూర్ గ్రామస్థులు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి సంగాపూర్లోని డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాముంటున్న విషయం తెలిసిందే. వారికి సంబంధించిన పోలింగ్ కేంద్రాన్ని ఏటిగడ్డకిష్టాపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. సంగాపూర్ నుంచి ప్రత్యేకంగా 11 బస్సులను ఏర్పాటు చేసి ఓటర్లను తరలించనున్నారు. 692 మంది ఓటర్లకు ఉండగా వారికి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేశారు. గజ్వేల్ తహసీల్దార్ హేమామాలిని, తొగుట తహసీల్దార్ సయ్యద్ మథీన్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
దుబ్బాకలో ఓటర్లు 1,98,756
పురుషులు 97,978
మహిళలు 1,00,778
సర్వీస్ ఓటర్లు 51
పురుషులు 50
స్ర్తీలు 1
మండలాలు : 7
గ్రామాలు : 148
మున్సిపాలీటీ-1
పోలీంగ్ కేంద్రాలు-315
సమస్యాత్మక కేంద్రాలు-89
పీఓలు-400
ఏపీఓలు-800
నియోజక వర్గ వ్యాప్తంగా వృద్దులు-6150
ఈవీఎంలు- 315
అదనపు ఈవీఎంలు-120
పోలీంగ్ సిబ్బంది-2000
Updated Date - 2020-11-03T11:12:07+05:30 IST