మదినిండా మల్లన్న నామస్మరణ
ABN, First Publish Date - 2020-03-16T08:00:15+05:30
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ వారం జాతర(ఆదివారం)కు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
భక్తజనసంద్రమైన కొమురవెల్లి ఆలయ పరిసరాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ వారం జాతర
చేర్యాల, మార్చి 15: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ వారం జాతర(ఆదివారం)కు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తజనసంద్రంగా మారింది. కోనేరులో పుణ్యస్నానమాచరించిన భక్తులు మదినిండా మల్లన్న నామస్మరణ చేశారు. సంప్రదాయబద్ధంగా బెల్లం పాయసంతో బోనం నివేదించి చెలక, నజరు, ముఖమండప పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు.
మల్లన్నను దర్శించుకుని ఒడిబియ్యం, పట్టువస్త్రాలు, బండారి అందజేసి వేడుకున్నారు. అలాగే ఎల్లమ్మతల్లికి బోనం నివేదించి బెల్లంపానకం, కల్లు శాక పెట్టారు. కోరికలు ఈడేర్చమని గంగిరేగు చెట్టుకు ముడుపు కట్టారు. ఆర్జిత సేవలు, మొక్కుబడులు, పట్నాలు, బోనాలు, వసతిగదుల అద్దె, ప్రసాద విక్రయాలు, ప్రత్యేక దర్శనాల ద్వారా సుమారు రూ.10లక్షల మేర బుకింగ్ ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయవర్గాలు ఏర్పాట్లు చేపట్టాయి. అయితే.. వసతిగదులు దొరకక, లాకర్ సదుపాయం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.
Updated Date - 2020-03-16T08:00:15+05:30 IST