తొలిరోజే అవాంతరాలు
ABN, First Publish Date - 2020-10-30T11:47:29+05:30
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ‘ధరణి’ పొర్టల్ తొలిరోజే తెరచుకోలేక సతాయించింది.
రాత్రి వరకు వేచి చూసిన తహసీల్దార్లు
సీఎం ప్రస్తావించిన తూప్రాన్లోనూ కనిపించని రికార్డులు
తూప్రాన్, అక్టోబరు 29: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ‘ధరణి’ పొర్టల్ తొలిరోజే తెరచుకోలేక సతాయించింది. ముఖ్యమంత్రి ప్రారంభించిన ఆనంతరం ధరణి పొర్టల్ను తహసీల్దార్లు ప్రారంభించారు. తహసీల్దార్లకు లాగిన్ పాస్వర్డ్ కేటాయించినప్పటికీ, సైట్ జాడ కనిపించలేదు. ఇప్పటి వరకు శిక్షణ కోసం తహసీల్దార్లకు ఇచ్చిన ధరణి పొర్టల్ డెమోను ప్రారంభించారు. ఆలస్యంగానైనా ధరణి పొర్టల్ తెరచుకుంటుందని అధికారులు రాత్రి వరకు వేచి ఉన్నారు. ధరణి సైట్ జాడ కనిపించకపోవడంతో అధికారులు ఇంటిబాట పట్టారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో సీఎం కేసీఆర్ ధరణి పొర్టల్ను ప్రారంభించారు. ప్రారంభోపన్యాసంలో ప్రత్యేకంగా మెదక్ జిల్లా తూప్రాన్ మండలాన్ని ప్రస్తావించారు.
ధరణి పోర్టల్ అద్బుతంగా, బ్రహ్మండంగా పనిచేస్తోందని చెబుతూ తన మిత్రుడైన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రవణ్కుమార్రెడ్డికి తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామశివారులో వ్యవసాయ భూమి ఉందని, బుధవారం రాత్రే ఆయన ఉత్సాహం కొద్ది ధరణి పోర్టల్ వెబ్సైట్ను తెరిచి తన భూమి వివరాలు చూసుకుని, చాలా సంతోషపడ్డాడన్నారు. తనకు కూడ చూపించడంతో ఆశ్చర్యపోయానని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. పోర్టల్లో భూముల వివరాలు బ్రహ్మండంగా కనిపిస్తున్నాయని చెప్పారు. కానీ సీఎం పేర్కొన్న తూప్రాన్ మండల ధరణి పొర్టల్ కూడా తెరచుకోలేదు. ధరణి పొర్టల్ తెరచుకుంటేనే స్లాట్ బుకింగ్లు చేసుకోడానికి వీలుంటుంది. వ్యవసాయ భూముల కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ల కోసం ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవలసి ఉంటుంది.
హవేళీఘణపూర్:హవేళీఘణపూర్లోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ను తహసీల్దార్ వెంకటేశం గురువారం ప్రారంభించారు. ధరణి పోర్టల్ ప్రారంభించినా సర్వర్ సమస్యలు తలెత్తాయి. దీంతో ధరణి పోర్టల్ ఆన్ కాలేదు.
Updated Date - 2020-10-30T11:47:29+05:30 IST