‘ధరణి’ విప్లవాత్మక మార్పునకు నాంది : కలెక్టర్
ABN, First Publish Date - 2020-11-03T11:20:27+05:30
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ విప్లవాత్మక మార్పునకు నాంది అని కలెక్టర్ వెంకట్రామారెడ్డి అన్నారు. ధరణి వెబ్సైట్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సోమవారం ఆయన కంది తహీసీల్దార్, జాయింట్ రిజిస్ట్రార్ కార్యాలయంలో
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి)
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ విప్లవాత్మక మార్పునకు నాంది అని కలెక్టర్ వెంకట్రామారెడ్డి అన్నారు. ధరణి వెబ్సైట్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సోమవారం ఆయన కంది తహీసీల్దార్, జాయింట్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రారంభించి మాట్లాడారు. భూ సంస్కరణ చరిత్రలోనే ఇదొక చారిత్రాత్మక సంస్కరణగా పేర్కొనవచ్చని ప్రశంసించారు. ఆలస్యం లేకుండా 15 నుంచి 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. బ్యాంక్ పాస్ బుక్ మాదిరిగానే ధరణిలో మార్పులు జరుగుతాయని, రైతు వద్ద పాస్బుక్ లేకపోతే కొత్త పాస్బుక్ వారం రోజుల్లో ఇంటికి వస్తుందన్నారు.
తొలి రిజిస్ట్రేషన్
కంది మండలం ఎర్దనూర్తండాకు చెందిన లంబాడీ బాల్య తన భార్య నెనావత్ చాంది పేరిట 20.5 గుంటల భూమిని గిఫ్ట్ డీడ్ చేయడం ద్వారా కలెక్టర్ వెంకట్రామారెడ్డి పర్యవేక్షణలో తొలి రిజిస్ర్టేషన్ చేసి ధరణి సేవలను ప్రారంభించారు. ఈ రిజిస్ర్టేషన్కు సంబంధించిన డాక్యుమెంట్ను కలెక్టర్ చాందికి అందజేశారు. తొలి రిజిస్ట్రేషన్ చేసుకున్న చాందికి కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి మిఠాయిలు ఇచ్చారు. కాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంత సులువుగా అవుతుందని తాము కలలో కూడా ఉహించలేదని లంబాడి బాల్య, చాంది తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో నగేష్, తహసీల్దార్ పరమేశ్వర్, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి, కార్యదర్శి గౌతమ్కుమార్, జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాములు, కార్యదర్శి షఫీ, ఎంపీపీ అధ్యక్షురాలు సరళ, సర్పంచ్ విమల పాల్గొన్నారు.
Updated Date - 2020-11-03T11:20:27+05:30 IST