కరోనా దాటికి మొక్కజొన్న రైతు కుదేలు
ABN, First Publish Date - 2020-03-16T07:28:25+05:30
కరోనా ఎఫెక్ట్ ప్రపంచానే కుదిపేస్తున్నది. దీని తాకిడికి దేశాల ఆర్థికవ్యవస్థలే అతలాకుతలం అవుతున్నాయి.
కోళ్ల పెంపకం నిలిచిపోవడంతో మక్కలకు తగ్గిన డిమాండ్
భారీగా పడిపోయిన మక్కల ధరలు
రూ. 2,500 నుంచి రూ.1,500కు పడిపోయిన వైనం
చేలల్లోనే 50శాతం మక్కజూళ్లు
దయనీయస్థితిలో మొక్కజొన్న రైతులు
ప్రభుత్వమే ఆదుకోవాలని మొ
గుమ్మడిదల, మార్చి 15: కరోనా ఎఫెక్ట్ ప్రపంచానే కుదిపేస్తున్నది. దీని తాకిడికి దేశాల ఆర్థికవ్యవస్థలే అతలాకుతలం అవుతున్నాయి. మన దేశంలోని రాష్ట్రాల్లో ఈ వైరస్ దాటికి వాణిజ్య సంస్థలు భారీగా నష్టాలను చవిచూడాల్సివస్తోంది. కరోనా ఎఫెక్ట్తో మొక్కజొన్న సాగుచేస్తున్న రైతులు కుదేలవుతున్నారు.
మక్కలకు తగ్గిన డిమాండ్
ప్రజలు చికెన్ తింటే కరోనా వస్తుందని పుకార్లు రావడంతో మాంసాహారులు పెద్ద సంఖ్యలో చికెన్ మానేశారు. దీంతో కోళ్ల దిగుమతి తగ్గిపోయింది. కోళ్లకు దానాగా పంపిణీ చేసే మక్కల ఎగుమతి భారీగా పడిపోయింది. క్షేత్రస్థాయిలో మొక్కజొన్నల ధర పడిపోయింది. దళారులు గతంలో మొక్కజొన్నలు రైతుల నుంచి పోటీపడుతూ కింటాల్ ధర రూ.2,500 చెల్లించి కొనుగోలు చేశారు. ఇప్పుడు కరోనా వైర్సతో అమ్మకాలు తగ్గిపోయిందని దళారులు రైతులను మభ్య పెడుతూ క్వింటాల్ మక్కలకు రూ.1,500 ఽఅడుగుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరకు అమ్మితే పెట్టుబడులు సైతం చేతికి రాక నష్టపోవాల్సివస్తుందని రైతులు వాపోతున్నారు.
దీంతో ఓవైపు ఆశించిన ధర రాక, మరోవైపు అమ్ముకోలేక పొలంలోనే జూళ్లు, మక్కల కుప్పలుగా పెట్టుకొని కనీసమద్ధతు ధర కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఒక గుమ్మడిదల మండలంలోనే కాకుండా జిల్లాలో వేల సంఖ్యలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీప్ లో మొక్క జొన్న పంట చేతికి వచ్చిన వెంటనే మొక్కజొన్న కొట్టి జూళ్లు వేసి అదును పోతుందని రైతులు వెంటనే రెండో పంటగా శనగ పంట సాగు చేస్తారు. అదే సమయంలో మక్కలు అమ్ముకోలేని రైతులకు అనుకోకుండా కరోనా వైరస్ ఎఫెక్ట్తో కుదేలయ్యారు.
మండలంలో 50శాతం పంట చేలల్లోనే
గుమ్మడిదల మండలంలో ఈసారి అన్ని గ్రామాల్లో వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసి రైతులు దిగుబడి తీశారు. గుమ్మడిదల మండలంలో 50 శాతం మంది రైతులు మొక్క జొన్నలు అమ్ముకోలేక పంట చేలలోనే జూళ్లు వేసి కుప్పలుగా వేసి కాపాడుకొంటున్నారు. వాటి రక్షణ కోసం కంటి మీద కునుకే కరువైందని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని గుమ్మడిదల మండల కేంద్రంలో ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి - పడమటి లక్ష్మారెడ్డి, రైతు గుమ్మడిదల
కరోనా ఎఫెక్ట్కు నష్టపోతున్న మొక్క జొన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. భూమిని నమ్ముకొని జీవిస్తున్న రైతులకు ఇలాంటి నష్టాలను తట్టుకోలేరు. ఈసమయంలో ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాల్సి ఉంది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి.
మార్క్ఫెడ్ దృష్టికి తీసుకుపోతా- నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్
గుమ్మడిదల మండలంలో మిగిలిపోయిన మొక్కజొన్న పంటను రైతుల నుంచి కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ మేనేజర్ దృష్టి తీసుకువెళ్తా. గతంలో మార్క్ఫెడ్ సహకారంతోనే మండలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. రైతులకు న్యాయం చేస్తా.
Updated Date - 2020-03-16T07:28:25+05:30 IST