యూకే నుంచి జిల్లాకు మరో ఆరుగురి రాక
ABN, First Publish Date - 2020-12-29T05:17:35+05:30
బ్రిటన్ నుంచి మరో ఆరుగురు తాజాగా జిల్లాకు వచ్చారు. వారిలో పటాన్చెరుకు చెందిన వారు ఐదుగురు ఉండగా, ఒకరు సంగారెడ్డి పట్టణ వాస్తవ్యులు.
పటాన్చెరులో ఐదుగురు, సంగారెడ్డికి చెందిన ఒకరు
కొవిడ్ నిర్ధారణ కోసం శాంపిళ్ల సేకరణ
సంగారెడ్డి అర్బన్, డిసెంబరు 28 : బ్రిటన్ నుంచి మరో ఆరుగురు తాజాగా జిల్లాకు వచ్చారు. వారిలో పటాన్చెరుకు చెందిన వారు ఐదుగురు ఉండగా, ఒకరు సంగారెడ్డి పట్టణ వాస్తవ్యులు. కొవిడ్ నిర్ధారణ కోసం వారిలో ముగ్గురి శాంపిళ్లను సోమవారం పంపగా, మిగతా ముగ్గురి శాంపిళ్లను మంగళవారం పంపనున్నామని డీఎంహెచ్వో డాక్టర్ మోజీరాంరాథోడ్ తెలిపారు. ఇప్పటికే యూకే నుంచి జిల్లాకు 25 మంది వచ్చిన విషయం తెలిసిందే. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా కొత్త రకం వైరస్ నిర్ధారణ కోసం (జీనోమ్ సీక్వెన్స్ టెస్టు) ఆ వ్యక్తి శాంపిళ్లను సీసీఎంబీకి పంపారు. ఆ ఫలితం ఇంకా రావాల్సి ఉంది. అయితే కొవిడ్ పాజిటివ్ వచ్చిన పటాన్చెరుకు చెందిన వ్యక్తికి సంబంఽధించి ప్రైమరీ కాంటాక్ట్స్ నలుగురికి కొవిడ్ నెగటివ్ ఫలితం వచ్చిందని తెలిపారు. జిల్లాలో కొవిడ్, కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ నియంత్రణ విషయంలో అప్రమత్తంగా ఉన్నామని డీఎంహెచ్వో రాథోడ్ స్పష్టం చేస్తున్నారు.
జిల్లాలో మరో ఎనిమిది మందికి పాజిటివ్
జిల్లాలో సోమవారం ఎనిమిది మందికి కరోనా నిర్థారణ అయ్యిందని డీఎంహెచ్వో తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డిలో-6, పటాన్చెరు మండలం నందిగామలో ఇద్దరికి కరోనా సోకిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 622 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేశామని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2020-12-29T05:17:35+05:30 IST