ఎకరంలో 22 రకాల దేశీ వరి
ABN, First Publish Date - 2020-12-17T05:52:34+05:30
అభివృద్ధిలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే గుర్తింపు పొందిన గ్రామం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని ఇబ్రహీంపూర్. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దత్తత తీసుకున్న ఈ గ్రామంలో ఓ రైతు దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నారు. విత్తనోత్పత్తిలోనూ గ్రామాన్ని ఆదర్శంగా నిలిపాడు.
ఇబ్రహీంపూర్లో దేశీ వరి వంగడాల సాగు
సేంద్రియ పద్ధతుల్లో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి
విత్తనోత్పత్తి సాగులో ఆదర్శంగా నిలుస్తున్న రైతు నగే్షరెడ్డి
నారాయణ కామిని, రత్న చోడి, మైసూర్ మల్లిక, ఇల్లపు సాయి, నవారా, కాలాబట్టి.. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా .. దేశీ వరి వంగడాలు.. ఇవి హైబ్రిడ్ వరి వంగడాల్లా కాదు ఎన్నో ఔషధ గుణాలున్న దేశీ రకాలు. ఇవి ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో సాగవుతున్నాయి. ఎలాంటి రసాయనాలు లేకుండా సేంద్రియ పద్దతిలో సాగు చేస్తున్నారు. నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో ఓ రైతు తన ఎకరం భూమిలో 22 రకాల దేశీ వరి వంగడాలను సాగు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
నారాయణరావుపేట, డిసెంబరు 16 : అభివృద్ధిలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే గుర్తింపు పొందిన గ్రామం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని ఇబ్రహీంపూర్. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దత్తత తీసుకున్న ఈ గ్రామంలో ఓ రైతు దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నారు. విత్తనోత్పత్తిలోనూ గ్రామాన్ని ఆదర్శంగా నిలిపాడు. వ్యవసాయ శాఖ, ఆత్మ కమిటీ, వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ కుంబాల నగే్షరెడ్డి తన ఎకరా వ్యవసాయ భూమిలో 22 రకాల దేశీవాళీ వరి వంగడాలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సీతారాంపల్లి గ్రామం నుంచి ఈ విత్తనాలు సేకరించి సాగు చేశారు. మంత్రి హరీశ్రావు ప్రోత్సాహం, వ్యవసాయాధికారుల పర్యవేక్షణలో ప్రయోగ దశలోనే లక్ష్యాన్ని సాధించారు. దేశవాళీ వరి వంగడాల సాగుతో భూసారం దెబ్బతినకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చునని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ఈ వంగడాలను చూపించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో యాసంగిలో నారు మళ్లు తయారు చేసుకున్న రైతులు దేశీ వరి వంగడాల విత్తనాల పట్ల ఆసక్తి చూపుతున్నారు.
మార్కెట్లో మస్తు డిమాండ్
మైసూర్ మల్లిక, కాలాబట్టి, ఇల్ల్షసాంబ, నారాయణ కామిని వంటి దేశీ వంగడాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో వీటి ధర కిలోకు సుమారు రూ.150 ఉంటుందని అధికారులు తెలిపారు. బ్లాక్రైస్, పంచరత్న, తులసీబానో, కామినిబోగ్ వంటి దేశీ వంగడాలు మార్కెట్లో కిలోకు సుమారు రూ.200 ధర పలుకుతున్నది. దేశవాళీ వరి వంగడాలు పండించిన రైతులకు మంచి డిమాండ్ ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు.
దేశీ వరి వంగడాలతో ప్రయోజనాలు మెండు
దేశీయ వంగడాల ద్వారా పండించిన ఈ బియ్యం మనిషికి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తుంది. ఆరోగ్యం అందించేందుకు ఎంతో తోడ్పడతాయి. పిల్లలకు అధిక పోషక విలువలు, మంచి ప్రొటీన్స్ను కలిగి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటిని సాగు చేయడం ద్వారా భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. నవారా రైస్ తినడం ద్వారా షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం ఉంటుందని, షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి ఔషధంలా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కేరళ ఆయుర్వేదంలో ఈ బియ్యాన్ని ఉపయోగిస్తారు. ఇండియా వయాగ్రా రైస్ అని పిలిచే ఈ బియ్యం పక్షవాతం ఉన్నవారికి మంచిది. వీటితో పాటు రత్న చోడి, తులసి బాసో వంటి ధాన్యం రోగనిరోధక శక్తి పెంచడంలో దోహదపడుతాయి.
సాగు చేసిన దేశీ వరి వంగడాలు
ఎకరం వ్యవసాయ భూమిలో సేకరించిన దేశీ వరి వంగడాలను సాగు చేశారు. ఒక్కో రకం పంట దాని కాల పరిమితి వివరాలను వ్యవసాయ అధికారులు వెల్లడించారు.
వంగడం రకం కాలపరిమితి
నారాయణ కామిని 135 రోజులు
రత్న చోడి 120 రోజులు
మైసూర్ మల్లిక 130 రోజులు
ఇల్లపు సాయి 140 రోజులు
నవారా 120 రోజులు
కాలాబట్టి 150 రోజులు
కాలబట్ 150 రోజులు
కాకిరెక్కల 150 రోజులు
రెడ్ జాస్మిన్ 135 రోజులు
మాల్ సుందరి 145 రోజులు
తులసి బసే 135 రోజులు
రవికంద 150 రోజులు
బాస్ బోగ్ 160 రోజులు
పసిడి 160 రోజులు
దడ్డిగ 130 రోజులు
చింతలూరి సన్నాలు 135 రోజులు
పరిమల సన్నాలు 135 రోజులు
కామీనీ బోగ్ 135 రోజులు
సన్న జాజులు 135 రోజులు
పంచరత్నం 130 రోజులు
గావి 135 రోజులు
కులకర్ణి 150 రోజులు
భవిష్యత్తు దేశీ వరి వంగడాలదే
మంచి ఔషధ గుణాలు ఉన్న దేశీ వరి వంగడాలను రైతులు భవిష్యత్తులో ఎక్కువ సాగు చేస్తారు. ఈ దేశీ వంగడాల బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రైతులు సేంద్రియ పద్ధతుల్లో బ్లాక్ రైస్, నవారా వంటి వంగడాలు సాగు చేస్తున్నారు. కొంత మొత్తంలో రైతులకు విత్తనాలు అందించే ప్రయత్నంలో భాగంగా మంత్రి హరీశ్రావు సూచనల మేరకు ఇబ్రహీంపూర్ గ్రామంలో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసి 22 రకాల దేశీ వంగడాలను సాగు చేశాం.
-నాగార్జున్, వ్యవసాయ విస్తరణాధికారి, నారాయణరావుపేట
రైతులకు కొత్త రకం విత్తనాలు అందించాలి
చుట్టు పక్కల రైతులకు మంచి నాణ్యమైన కొత్త రకం విత్తనాలను అందించాలనే లక్ష్యంతో మంత్రి హరీశ్రావు ప్రోత్సాహంతో దేశీ వరి వంగడాలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేశాను. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల పర్యవేక్షణతో మంచి దిగుబడి వచ్చింది. మంత్రి ప్రోత్సాహం, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సహకారం బాగుంది. దేశి వంగడాల సాగులో అనుకున్న లక్ష్యాన్ని సాధించాం. సంతోషంగా ఉంది.
- కుంబాల నగేష్ రెడ్డి, రైతు ఇబ్రహీంపూర్
Updated Date - 2020-12-17T05:52:34+05:30 IST