పోలీస్ కమిషనరేట్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2020-08-09T08:06:05+05:30
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులపూర్కు చెందిన చిట్ల విజయ్కుమార్(27) శనివారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు...
- ఎస్సై, జడ్పీటీసీల వేధింపులే కారణమని వెల్లడి
కరీంనగర్ క్రైం, ఆగస్టు 8: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులపూర్కు చెందిన చిట్ల విజయ్కుమార్(27) శనివారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు విజయ్ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. బుగ్గారం ఎస్సై, జడ్పీటీసీల వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆ యువకుడు పేర్కొన్నాడు. విజయ్కుమార్కు మూడున్నర ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో అర ఎకరం వరకు దారికి ఉచితంగా వదిలిపెట్టాలని జడ్పీటీసీ బాదినేని రాజేందర్ ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిపాడు. అంగీకరించకపోవడంతో రౌడీషీట్ తెరచి అంతుచూస్తానంటూ బుగ్గారం ఎస్సై చిరంజీవి, జడ్పీటీసీ వేధిస్తున్నారని వాపోయాడు. కుట్రపూరితంగా తనతోపాటు తన తల్లి, సోదరుడు, బావ నలుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు సంబంధం లేకున్నా.. మంత్రి కొప్పుల ఈశ్వర్పై ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్టు చేశానని సైబర్ క్రైం కేసు నమోదు చేశారని తెలిపాడు. ఎస్సై తన ఇంటికి కానిస్టేబుళ్లను పంపిస్తూ తన కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేస్తుండటంతో 20 రోజులుగా తాము ఇంటికి వెళ్లకుండా బయటే తిరుగుతున్నామని తెలిపాడు.
Updated Date - 2020-08-09T08:06:05+05:30 IST