రైతులను బిచ్చగాళ్లను చేస్తారా
ABN, First Publish Date - 2020-09-20T07:41:12+05:30
రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆ పార్టీ ఎంపీలు ప్రకటించారు.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆ పార్టీ ఎంపీలు ప్రకటించారు. ఈ అంశంపై శనివారం సీఎం కేసీఆర్తో చర్చించిన తర్వాత టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. రైతులను బిచ్చగాళ్లను చేద్దామనుకుంటున్నారా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
లోక్సభలో మెజారిటీ ఉందని ఆమోదింపజేసుకున్నారని, రాజ్యసభలో ఈ బిల్లులను తాము వ్యతిరేకిస్తామని ప్రకటించారు. దేశ రైతాంగం నష్టపోయేలా లాక్డౌన్ సమయంలో ఆర్డినెన్సులు తెచ్చారని, వారిపై ఎందుకింత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని నామా ప్రశ్నించారు.
మొక్కజొన్నల దిగుమతి సుంకాన్ని 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడాన్ని టీఆర్ఎస్ ఎంపీలు వ్యతిరేకించారు. ‘‘రాష్ట్రాల్లో పండే మొక్కజొన్నలను పక్కన బెట్టి 35 శాతం దిగుమతి సుంకాన్ని తగ్గించి మరీ విదేశాల నుంచి 50 లక్షల టన్నులను కేంద్రం దిగుమతి చేసుకుంటున్నది. ఈ చర్యలతో రైతాంగానికి నష్టం చేస్తోంది’’ అని కేకే వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేటీకరణ చేస్తోందని ఆయన విమర్శించారు.
Updated Date - 2020-09-20T07:41:12+05:30 IST