ఎదురుచూపులు
ABN, First Publish Date - 2020-07-01T11:08:15+05:30
పప్పు శనగ బకాయిల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మూడు నెలల నుంచి పప్పు శనగ, మొక్కజొన్నకు సంబంధించిన బకాయిలు రాకపోవడంతో రైతులు
రైతుల ఖాతాల్లో జమ కాని పప్పు శనగ డబ్బులు
మూడు నెలలుగా పెండింగ్లో బకాయిలు
గద్వాల, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) :
పప్పు శనగ బకాయిల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మూడు నెలల నుంచి పప్పు శనగ, మొక్కజొన్నకు సంబంధించిన బకాయిలు రాకపోవడంతో రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టలేకపోతున్నారు. నిత్యం బ్యాంకుల వద్దకు వెళ్లి ఖాతాలను పరిశీలించుకోవడం, సహకార సంఘాల వద్దకు వెళ్లి డబ్బులు ఎప్పుడు జమ అవుతామని ప్రశ్నించి తిరిగి వెళ్తున్న సంఘటనలు జరుగుతున్నాయి.
జోగుళాంబ గద్వాల జిల్లాలో పప్పు శనగ 61,699 క్వింటాళ్లను సహకార సంఘాలు రైతుల నుంచి కొనుగోలు చేసి, మార్క్ఫెడ్కు అప్పగించారు. క్వింటాలు శనగను రూ.4,875 కొనుగోలు చేశారు. అయితే ఇప్పటి వరకు రూ.30.07 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. మూడు నెలలుగా ఇవ్వకపోవడంతో వ్యవసాయ పెట్టుబడికి కష్టంగా ఉందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే క్వింటాలుకు రూ.1,760 చొప్పున 93,547 క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి రూ.16.46 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. కందుకులకు సంబంధించిన బకాయిలు మాత్రం చెల్లింపు చేశారు. ఈ విషయాన్ని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విష్ణువర్థన్రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన ఆయన, వెంటనే మార్క్ఫెడ్ అధికారులకు ఫోన్ చేసి బకాయిలు చెల్లించాలని అదేశించారు. జిల్లా మార్కెఫెడ్ అధికారి శివనాగరాజు ఒకటి రెండు రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని మంత్రికి సమాధానమిచ్చారు.
Updated Date - 2020-07-01T11:08:15+05:30 IST