చెరువు ఆదెరువు..జూరాల ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులకు నీరు
ABN, First Publish Date - 2020-08-03T11:17:02+05:30
ఉమ్మడి జిల్లా సాగునీటి రంగం బలోపేతానికి చెరువులు అదెరువుగా నిలుస్తున్నాయి. ఆయకట్టుకు నీరందించి, అన్నదాతకు భరోసా ఇస్తున్నాయి. జూరాల నుంచి నాలుగేళ్ల
ఉమ్మడి జిల్లాలో జలకళను సంతరించుకుంటున్న వాటి సంఖ్య 1,120
గొలుసుకట్టు ఆధారంగా సాగునీటి రంగం వృద్ధి
డిస్ర్టిబ్యూటరీల వ్యవస్థ లేకున్నా ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లు
ఈ ఏడాది వర్షాలతోనే సగం చెరువుల్లోకి భారీగా నీటి రాక
ఆంధ్రజ్యోతి, వనపర్తి :
ఉమ్మడి జిల్లా సాగునీటి రంగం బలోపేతానికి చెరువులు అదెరువుగా నిలుస్తున్నాయి. ఆయకట్టుకు నీరందించి, అన్నదాతకు భరోసా ఇస్తున్నాయి. జూరాల నుంచి నాలుగేళ్ల కిందట ప్రారంభించిన మహాత్మాగాంధీ, నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాల కింద పంటలు సాగు చేసేందుకు తోడ్పాటును అందిస్తున్నాయి. దాంతో ఒకప్పుడు నీటి వనరులు లేక పొట్ట కూటి కోసం ముంబై, పుణె, బెంగళూరు, హైదరాబాద్కు వంటి ప్రాంతాలకు లక్షల సంఖ్యలో ప్రజలు వలస వెళ్లిన పరిస్థితిలో మార్పు వచ్చింది. ఎత్తిపోతల పథకాల కింద నీటి పంపిణీ వ్యవస్థలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోయినా, చెరువులను నింపడం ద్వారా ఒకప్పుడు బీడుగా ఉన్న భూములు నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో చెరువులు ఏటా జలకళను సంతరించుకుంటున్నాయి. చిన్న కుంటల నుంచి భారీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న చెరువుల వరకు అన్నింటిలో నీటిని నిల్వ ఉంచుతున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు వస్తోంది. దాని ఆధారంగా ఉన్న భీమా 1, 2, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాలకు నీటి పంపింగ్ కొద్ది రోజుల కిందటే ప్రారంభమైంది. తాజాగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడిపల్లి గట్టు రి జర్వాయర్ నుంచి నీటి విడుదలను మంత్రి నిరంజన్రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని పలు చెరువులు ఇప్పటికే జలకళను సంతరిం చుకోగా, ఎత్తిపోతల పథకాల నుంచి వస్తున్న నీటి ద్వారా మరిన్ని చెరువులు నీటితో కళక ళలాడనున్నాయి.
1120 చెరువులకు కృష్ణమ్మ శోభ
ఎగువ నుంచి ఏటా వరద వస్తున్నా కొన్నేళ్ల కిందటి వరకు రాష్ట్ర వాటాను సరిగా వినియో గించుకోలేని పరిస్థితి ఉండేది. పలు ఎత్తిపోతల పథకాలు ప్రారంభించిన తర్వాత ఆయకట్టుకు నీరం దించడానికి డిస్ర్టిబ్యూటరీలు, ఫీడర్ ఛానళ్ల అవసరం వచ్చింది. కానీ అందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రభుత్వం రాష్ట్ర వాటాను వినియోగించుకునేందుకు చెరువుల కింది ఆయకట్టుకు పునరుజ్జీవం కల్గించేందుకు ప్రయత్నాలను ప్రారంభిం చింది. జిల్లాలోని వేలాది చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా మరమ్మతులు చేశారు. దీంతో గొలుసుకట్టు ఆధారంగా ఉన్న ప్రతి చెరువును నీటితో నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వనపర్తి జిల్లాలో జూరాల, భీమా ఫేజ్ 2, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా సుమారు 370 చెరువులను గతేడాది నింపారు. ఈ ఏడాది మరిన్ని చెరువులను నింపేందుకు ప్రయత్నాలు ప్రారం భించారు.
నాగర్కర్నూల్ జిల్లాలో మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం కింద గతేడాది దాదాపు 388 చెరువులను నింపగా, ఈ ఏడాది సుమారు 400 చెరువులను నింపేందుకు ప్రణాళికలు రూపొం దించా రు. మహాత్మగాంధీ ఎత్తిపోతల పథకం కింద కీలకమైన గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను ఆదివారం ప్రారంభించారు. దాంతో చెరు వులు త్వరలోనే జలకళను సంతరించుకోనున్నాయి. గద్వాల జిల్లాలో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా గతేడాది 120 చెరువులను నింపగా, ఈ ఏడాది 15 శాతం అదనంగా చెరువులు నింపనున్నట్లు తెలు స్తోంది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజక వర్గంలో భీమా ఫేజ్ 1 ద్వారా దాదాపు 130 చెరువు లు, కుంటలను నీటితో నింపుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు 112 చెరువులను నింపేందుకు ప్రణాళికలు చేశారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 1,120 చెరువులను ఎత్తిపోతల పథకాలు, జూరాల ప్రాజెక్టు ద్వారా నింపనున్నారు.
వర్షాలకే నిండిన చెరువులు
ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదల ప్రారంభమైన నెల రోజుల తర్వాతే మెజారిటీ చెరువుల్లోకి నీరు వస్తుంది. కానీ ఈ ఏడాది వరద నీరు రాకముందే స్థానికంగా కురిసిన వర్షాలతోనే మెజారిటీ చెరువుల్లోకి నీరు చేరింది. ఈ ఏడాది అ న్ని ఎత్తిపోతల పథకాల కంటే ముందుగానే నెట్టెం పాడు పథకం ద్వారా ముందే నీటి విడు దలను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గతేడాది 120 చెరువులను నింపగా.. ఈ ఏడాది 120 చెరువుల కుగాను 60 శాతం చెరువులు స్థానికంగా కురిసిన వర్షాలకే నిండాయి. దీంతో నెట్టెంపాడు పథకం కింద ఒక పంప్ను మాత్రమే నడిపిస్తున్నారు. వనపర్తి జిల్లాలోని పాన్గల్ మండలంలో ఇప్పటికే రెండుసార్లు కురిసిన భారీ వర్షాలకు చెరువులన్నీ నిండాయి. ఈ మండలంలోని 31 చెరువులను భీమా ఫేజ్ 2 ద్వారా నింపేవారు. ఈ సారి వర్షాలకే అవి నిండాయి. ఎత్తిపోతల పథకాల ద్వారా నింపే చెరువుల్లోకి ఇప్పటికే నీరు చేరుకో వడంతో రాష్ట్ర వాటా మేరకు ఈ సారి నీటిని తోడుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
అలుగు పారిన చెరువులు
హన్వాడ: మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలో శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లాయి. ఇబ్రహీంబాద్ హేమ సముద్రం చెరువుకు ఆదివారం భారీగా నీరు చేరడంతో రెండు అలుగులు రెండు ఫీట్ల ఎత్తున పారుతున్నాయి. బుద్దారం, నాయినోనిపల్లి చెరువులు, కుంటలు కూడా అలుగు పారుతున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. గుడిమల్కాపూర్, టంకర, హన్వాడ, తిరుమలగిరి గ్రామాల చెరువులకు నీరు చేరింది. వాగులు, కాల్వలు పొంగడంతో పంట పొలాలకు గండ్లు పడ్డాయి. వరి, కంది ఇతర పంటలు నీట మునిగాయి.
Updated Date - 2020-08-03T11:17:02+05:30 IST