మహబూబ్నగర్ జిల్లా: పెళ్లింట భారీ చోరీ
ABN, First Publish Date - 2020-12-19T17:37:11+05:30
మహబూబ్నగర్ జిల్లా: బోయినపల్లిలో పెళ్లింట భారీ చోరీ జరగడం కలకలం రేపింది.
మహబూబ్నగర్ జిల్లా: మిడ్జిల్ మండలం, బోయినపల్లిలో పెళ్లింట భారీ చోరీ జరగడం కలకలం రేపింది. దాదాపు 2 వందల తులాల బంగారం, రూ. 6 లక్షల నగదు దుండగులు ఎత్తుకుపోయారు. బోయినపల్లి గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. తన కుమారుని వివాహం కోసం తెచ్చిన నగలతోపాటు కుటుంబసభ్యుల ఆభరణాలు, నగదు దొంగిలించారు. కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దొంగతనం జరగడం విశేషం.
ఇంద్రారెడ్డికి వ్యవసాయంతోపాటు రెండు వరికోత మిషన్లు ఉన్నాయి. చిన్నకుమారుడు తిలక్ రెడ్డి అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 23న పెళ్లి ఉన్నందున బ్యాంక్లో ఉన్న బంగారం తెచ్చి ఇంట్లో పెట్టారు. పక్కన ఇంద్రారెడ్డి అన్న ఇల్లు మరమ్మత్తులు చేస్తుండడంతో అతని బంగారం కూడా తమ్ముని ఇంట్లో ఉంచారు. ఇంటికి వచ్చిన బంధువుల నగలను కూడా దొంగలు ఎత్తుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2020-12-19T17:37:11+05:30 IST