ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో వెసులుబాటు
ABN, First Publish Date - 2020-12-30T04:23:19+05:30
ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో వెసులుబాటు
లింకు డాక్యుమెంట్లు ఉంటే ఎల్ఆర్ఎస్ అక్కర్లేదు
ఎల్ఆర్ఎస్ ఉంటేనే కొత్తవాటికి రిజిస్ట్రేషన్
ప్రభుత్వ తాజా నిర్ణయంతో కొంత ఊరట
ఖమ్మంటౌన్, డిసెంబర్ 29: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఉంటేనే ఖాళీ ప్లాట్లు, వెంచర్లకు రిజిస్ట్రేషన్ అవకాశం ఉంటుందని గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీప్లాట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కొంత సడలింపులు ఇస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గతంలో రిజిస్ట్రేషన్ అయి, లింక్ డాక్యుమెంట్లు ఉండి.. విక్రయించిన ఓపెన్ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ లేకుండానే రిజిస్ట్రేషన్ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీచేశారు. ఆ మేరకు మంగళవారం ఉమ్మడి జిల్లాలోని సబ్రిజిస్ట్రార్లకు ఉత్తర్వులను పంపారు. కానీ కొత్తగా వెంచర్లు వేసిన వాటికి డీటీపీసీ అనుమతి, లేఅవుట్ అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్లు చేయరు. లేదా ఆయా ఖాళీప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరణ ధ్రువపత్రం ఉండాల్సిందే. వాటి రిజిస్ట్రేషన్లు మాత్రమే నిలిపివేశారు.
కొంత వెసులుబాటు..
లింక్ డాక్యుమెంట్ల ద్వారా వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వ అనుమతి రావడంతో కొంత వెసులుబాటు లభించినట్టయింది. ఎందుకుంటే ఒక ఖాళీప్లాట్ గతంలో క్రయ, విక్రయాలు జరిగి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా.. ప్రస్తుతం ఎకరికైనా అమ్మాలంటే ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ప్రస్తుతం సడలింపు ఇచ్చి రిజిస్టే్ట్రషన్ అయి, లింక్ డాక్యుమెంట్ ఉంటే ఎల్ఆర్ఎస్ అక్కర లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో క్రయ, విక్రయాలు జోరుగా జరిగే అవకాశాలున్నాయి. తద్వారా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది.
సీఎంకు మంత్రి కృతజ్ఞతలు..
గతంలో రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో దరఖాస్తుదారులకు ఊరట కలుగుతుందని, ఈ నిర్ణయం తీసుకున్న సీఎంకు కృతజ్ఞతలు అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘సుడా’ చైర్మన్ బచ్చు విజయ్కుమార్ కూడా సీఎంకు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2020-12-30T04:23:19+05:30 IST