రిక్రూట్మెంట్కు వచ్చి పోలీసులకు దొరికాడు..
ABN, First Publish Date - 2020-11-23T03:45:58+05:30
నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యుడు భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి నుంచి ఒక బ్యానర్, విప్లవ సాహిత్యం, కరపత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
వాహనతనిఖీల సమయంలో పట్టుబడిన మావోయిస్టు పార్టీ సభ్యుడు
బ్యానర్, విప్లవ సాహిత్యం, కరపత్రాలు స్వాధీనం
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన అశ్వారావుపేట సీఐ
అశ్వారావుపేట, నవంబరు 22: రిక్రూట్మెంట్ కోసం వచ్చిన నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఓ సభ్యుడు భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి నుంచి ఒక బ్యానర్, విప్లవ సాహిత్యం, కరపత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ఉపేంద్రరావు ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. అశ్వారావుపేట మండలం నల్లబాడు గ్రామానికి చెందిన 22సంవత్సరాల గడ్డం వెంకన్నబాబు అలియాస్ అరుణ్ భద్రాచలంలో 2015లో ఇంటర్మీడియట్, 2018లో ఐటీఐ చదివాడు. ఆ సమయంలో చర్ల మండలం బూరుగుపాడు గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తి పరిచయమగా.. చర్ల గ్రామంలో ఒక ఫంక్షన్కు హాజరై కొద్దిరోజులు అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలోనే సీపీఐ మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యుడు రాందాస్తో పరిచయం ఏర్పడింది. అతడి ద్వారా సీపీఐ మావోయిస్టు పార్టీ సమావేశంలో పాల్గొని ప్రసంగాలకు ఆకర్షితుడై మావోయిస్టు పార్టీలో ఉంటే ఏదైనా సాధించవచ్చని నమ్మి, ఈ ఏడాది సెప్టెంబరు 4న చర్ల లోకల్ గెరిల్లా స్క్వాడ్ మధు దళంలో చేరాడు. దళంలో చేరిన రెండు రోజులకే పోలీసులను చంపాలని ఉద్దేశ్యంతో చర్ల మండలం పెద్దమిడిసిలేరు తాలిపేరు ప్రాజెక్టుకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డుపై మందుపాతర పేల్చిన ఘటనలో అగ్రనాయకులతో కలిసి ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. మళ్లీ సెప్టెంబరు 19న పోలీసులు లక్ష్యంగా చర్ల - భద్రాచలం రోడ్డులో తెడగ కలివేరు గ్రామాల మధ్య ఆర్అండ్బీ రోడ్డులో మూడు మందు పాతరలు అమర్చిన వారిలో ఉన్నాడు. అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రం తమ్మిరెల్లి అటవీ ప్రాంతంలో పోలీసులపై జరిపిన కాల్పుల్లో పాల్గొన్నాడు. సీపీఐ మావోయిస్ట్ పార్టీ మిలీషియా సభ్యులు రాందాస్, జయరాం, బాలు, ఆదేశాల మేరకు రెండు రోజుల క్రితం అశ్వారావుపేట ప్రాంతంలో యువతను రిక్రూట్ చేసుకునేందుకు రాగా.. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఏఎస్ఐ ఎంవీ. సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి ఊట్లపల్లి - వినాయకపురం రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా చేతిసంచితో ఊట్లపల్లి వస్తున్న వెంకన్నబాబు.. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. గమనించిఇన ఏఎస్ఐ సిబ్బందితో వెంబడించి అతడిని పట్టుకుని విచారించి పోలీస్స్టేషన్కు తరలించారు. అతడి నుండి విప్లవ సాహిత్యం, బ్యానర్, కరపత్రాలు, సర్క్యులర్ జిరాక్స్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వెంకన్నబాబును సత్తుపల్లి కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐ రామ్మూర్తి, ఏఎస్ఐ ఎంవీ సత్యనారాయణ, సిబ్బంది కె ప్రసాద్, పి ప్రసాద్, బి అరవింద్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-23T03:45:58+05:30 IST