కొత్త విద్యుత్తు చట్టంపై కేసీఆర్ అబద్ధాలు
ABN, First Publish Date - 2020-09-17T08:44:56+05:30
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ చట్టంపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని బీజేపీ రాష్ట్ర
బిల్లు పెట్టకముందే అసెంబ్లీలో తీర్మానమా?
దోపిడీకి అడ్డుపడుతుందనే వ్యతిరేకిస్తున్నారు
ఏపీ సీఎం జగన్కు లేని ఇబ్బంది మీకెందుకు?
టీఆర్ఎస్ హామీలపై నిలదీస్తాం: సంజయ్
హైదరాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ చట్టంపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ముసాయిదాను ఆధారం చేసుకుని రాజకీయం చేశారని, ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. బుధవారం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కొత్త విద్యుత్తు చట్టంపై ఏపీ సీఎం జగన్కు లేని ఇబ్బంది కేసీఆర్కు ఎలా ఉంటుందో చెప్పాలన్నారు. దీనిపై అవగాహన లేకపోతే జగన్ను మరోసారి భోజనానికి పిలిచి తెలుసుకోవాలని సూచించారు. కేంద్రం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టక ముందే దానిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఎలా చేశారో, కొత్త చట్టంతో ఉద్యోగాలు ఎలా పోతాయో చెప్పాలని అన్నారు.
రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్తు పేరిట భారీ దోపిడీ జరుగుతోందని, కొత్త చట్టం వస్తే ఆ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందనే వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలపై ఎక్కడికక్కడ నిలదీస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీ ఏర్పాటు చేయకముందు జరిగిన విద్యుత్తు ఒప్పందాలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. పాతబస్తీలో జరుగుతున్న విద్యుత్తు చౌర్యంపై, రూ.లక్షల్లో ఉన్న బకాయిలపై సీఎం ఎందుకు స్పందించడం లేదని సంజయ్ ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ జ్వరం కారణంగానే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మోదీ లేని దేశాన్ని ఊహించుకోలేం...
ప్రధాని నరేంద్రమోదీ లేని భారత దేశాన్ని ఊహించుకోలేమని, దేశంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి నెలకొందని బండి సంజయ్ అన్నారు. దేశ రక్షణ కోసం సంచలన నిర్ణయాలు రాబోతున్నాయన్నారు. బుధవారం ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో హోమం నిర్వహించగా.. ఢిల్లీలో హోం క్వారంటైన్ నుంచి సంజయ్ వర్చువల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 కేంద్రాల్లో హోమం నిర్వహించిన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషాతోపాటు జిల్లాల నాయకులను సంజయ్ అభినందించారు.
Updated Date - 2020-09-17T08:44:56+05:30 IST