ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారితో అప్రమత్తంగా ఉండాలి
ABN, First Publish Date - 2020-05-15T10:32:24+05:30
విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ డాక్టర్లు,
మంత్రి ఈటల రాజేందర్
సుభాష్నగర్, మే 14: విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, కమిషనర్ యోగితారానా, సంచాలకుడు శ్రీనివాసరావుతో కలిసి హైదరాబాద్ నుంచి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఎఎస్హెచ్ఏ కార్యకర్తలు, జిల్లా ప్రధాన ఆసుపత్రుల సూపరిండెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కోవిడ్-19 తాజా పరిస్థితులపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కరోనా కట్టడిని విజయవంతంగా నిర్వహించారంటూ వైద్య ఆరోగ్య సిబ్బందిని అభినందించారు.
మన రాష్ట్రానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారికి విధిగా క్వారంటైన్స్టాంప్ వేసి హోం క్వారంటైన్లో ఉంచాలని, వీరి గృహాలను ప్రతిరోజు సందర్శించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని వైద్యాధికారులు ఓపీలను పెంచాలని, రెండు వేర్వేరు చోట్ల ఓపీ చూడాలని సూచించారు. ఎస్ఎఆర్ఐ/ఐఎల్ఐ కేసులను గుర్తించి అందులో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని జిల్లా ప్రధాన ఆసుపత్రులకు పంపించి సత్వర చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు. గర్భవతుల డెలీవరీ ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకొని, వారికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అజయ్కుమార్, జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్రెడ్డి, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ రవిసింగ్, డీఐవో తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-05-15T10:32:24+05:30 IST