కొండగట్టుపై దయ చూపని సర్కారు
ABN, First Publish Date - 2020-03-16T08:47:30+05:30
కొండగట్టు అంజన్న దేవాలయంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. యేటా భక్తులు పెరుగుతున్నా సౌకర్యాలు మెరుగుపడటం లేదు. యేటా లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే ఆలయం వద్ద భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
అంజన్న దేవాలయంపై మరోమారు శీతకన్ను
మౌలిక వసతులు లేక ఇక్కట్లు పడుతున్న భక్తులు
కాగితాలకే పరిమితమైన రూ.100 కోట్ల మాస్టర్ ప్లాన్
దేవాలయానికి యేటా రూ.20 కోట్ల ఆదాయం
కాగితాలకే పరిమితమైన ఫోర్లైన్ నిర్మాణం
నిధుల కేటాయింపులో చొరవ తీసుకోని జిల్లా మంత్రులు
ఆంధ్రజ్యోతి, జగిత్యాల: కొండగట్టు అంజన్న దేవాలయంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. యేటా భక్తులు పెరుగుతున్నా సౌకర్యాలు మెరుగుపడటం లేదు. యేటా లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే ఆలయం వద్ద భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు లేకపోవడంతో పాటు బస చేసేందుకు కనీస సౌకర్యాలు లేవు. దీక్షాపరులు నానా అగచాట్లు పడుతుంటారు. భక్తుల సౌకర్యార్థం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆలయ అధికారులు రూ.15 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా బుట్ట దాఖలయ్యాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో రూ.100 కోట్లతో మాస్టర్ ప్లాన్ కాగితాలకే పరిమితమైంది.
కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న
మల్యాల మండలం ముత్యంపేట శివారులోని కొండపై ఉన్న ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఆహ్లాదకర వాతావరణంలో, పచ్చని చెట్ల మధ్య కొండపై వెలసిన ఆంజనేయ స్వామి దేవస్థానానికి దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. యేటా ఇక్కడ చైత్ర పౌర్ణమి రోజున చిన్న హనుమాన్ జయంతి, పూర్వాభాద్ర నక్షత, వైశాఖ బహుళ దశమి రోజున పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ రెండు జయంతిలకు కొండగట్టుకు దాదాపు 6 లక్షల మంది దీక్షాపరులు వచ్చి స్వామివారిని దర్శించుకుని మాల విరమణ చేస్తారు. చిన్న హనుమాన్ జయంతి ఐదు రోజుల పాటు జరుగుతుండగా, 3.50 లక్షల మంది దీక్షాపరులు కొండపైకి వస్తుంటారు. పెద్ద హనుమాన్ జయంతి మూడు రోజుల పాటు జరుగుతుండగా, 2.50 లక్షల మందికి పైగానే భక్తులు వస్తుంటారు. దీనికి తోడు ప్రతి మంగళవారం, శనివారం భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. శ్రావణ మాసంలో భక్తుల తాకిడి చెప్పనలవి కాదు.
పట్టించుకోని ప్రభుత్వం
కొండగట్టు ఆంజనేయ స్వామి ఎంతో మంది ఇలవేల్పుగా కొలుస్తుంటారు. ఇలాంటి ఆలయాన్ని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని నాయకులు పేర్కొని ఆరేళ్లు అవుతున్నా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. యేటా ఈ ఆలయానికి రూ.20 కోట్ల మేరకు ఆదాయం వస్తుండగా, జీతభత్యాలు పోను రూ.12 కోట్లు మిగులుతుంటాయి. ఇలా ఆదాయం కూడా భారీగానే వస్తున్నా సర్కారు మాత్రం అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయడం లేదు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ దేవాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నా కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆలయానికి మాత్రం ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించడం లేదు. రూ.100 కోట్లతో కొండపైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు గతంలో ప్రతిపాదనలు కూడా తయారు చేశారు. కొండపైన ప్రధాన సమస్య వసతి గృహాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు రాత్రి పూట బస చేసేందుకు ఎలాంటి సౌకర్యాలు లేవు. 200 గదులు నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు.
కొండపైన తాగునీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. యేటా హనుమాన్ జయంత్యుత్సవాలకు ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించాల్సిన పరిస్థితి ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేరులో స్నానాలు చేద్దామంటే మురికి నీరు ఉండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రెండవ కోనేరును నిర్మించినా నీరు లేకపోవడంతో నిరుపయోగంగా ఉంది. శాశ్వత పరిష్కారం కోసం సంతల లొద్ది నుంచి నీటిని కొండపైకి తరలించాలని ప్రతిపాదనలు ఉన్నా నిధుల లేమితో వెనుకడుగు వేస్తున్నారు. ఎండాకాలంలోనైతే భక్తులు కొండపై కాలు పెట్టడానికి కూడా వీలు లేకుండాపోతుంది. ఆలయం చుట్టూ షెడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మూత్రశాలలు, స్నానాల గదులు లేకపోవడంతో ఆరుబయటే మల విసర్జనతో పాటు స్నానాలు చేయాల్సిన పరిస్థితి ఉంది.
ఘాట్రోడ్డు ఘటనతో దేశవ్యాప్తంగా కలకలం
కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంకు వెళ్లే ఘాట్ రోడ్డుపై ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో 65 మంది ప్రాణాలు కోల్పోగా, కొండగట్టు దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకుని కొండ దిగుతుండటంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో ఘోర ప్రమాదం జరిగింది. చాలా మంది అధికారులు ఘాట్ రోడ్డును పరిశీలించి వెళ్లినా ఇప్పటివరకు దిద్దుబాటు చర్యలు చేపట్టలేకపోయారు. ఘాట్ రోడ్డుపై భారీ వాహనాల రాకపోకలకు అధికారులు నిషేదం విధించారు. అయితే భక్తులు మాత్రం ఘాట్రోడ్డు అలైన్మెంట్ బాగా లేదని, దానిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి రోడ్డును బాగు చేయాలని భక్తులు కోరుతున్నారు.
అలాగే కొండగట్టుపైకి మరో ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు కూడా తయారు చేశారు. ఫోర్ లైన్ రోడ్డు ఏర్పాటు చేసి ఇన్, ఔట్ వేలను ఏర్పాటు చేయాలని నిర్ణయంచారు. ఇందుకోసం అధికారులు, నాయకులు హడావిడి చేసి ఆరేడు మాసాలవుతున్నా ఇప్పటికీ అతీగతీ లేదు. దీంతో కొండగట్టు అంటేనే భక్తులు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో అతి పెద్ద దేవాలయంగా కొండగట్టు ఆంజనేయ స్వామికి గుర్తింపు ఉంది. కొండగట్టు దేవస్థానానికి సమీపంలో ఉన్న సిరిసిల్ల జిల్లా నుంచి ముఖ్యమంత్రి తనయుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో పాటు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్తో పాటు జగిత్యాల జిల్లా నుంచి కొప్పుల ఈశ్వర్లు మంత్రులుగా ఉన్నా బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో భక్తుల్లో విమర్శలు వివిపిస్తున్నాయి.
నిధులు విడుదల చేయకపోతే ఆందోళన చేస్తాం..మేడిపెల్లి సత్యం, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. యాదాద్రి, వేములవాడ, ధర్మపురి దేవాలయాలకు కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నా.. సీఎం కేసీఆర్ కొండగట్టుపైన దయ చూపడం లేదు. మౌలిక సౌకర్యాలు కూడా లేకపోవడంతో అంజన్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే ఆందోళన చేపడుతాం.
కొండగట్టుపై ప్రభుత్వం చిన్నచూపు... యాగండ్ల లక్ష్మీనారాయణ, వీహెచ్పీ అధ్యక్షుడు, మల్యాల
తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అన్ని దేవాలయాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్నా అంజన్న ఆలయ అభివృద్ధికి ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు. ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు మంత్రులు ఉన్నా ఒక్క రూపాయి కూడా రావడం లేదు.
Updated Date - 2020-03-16T08:47:30+05:30 IST