మానేరు పరవళ్లు
ABN, First Publish Date - 2020-08-22T11:13:58+05:30
ఎగువ మానేరు పొంగింది. రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. సాగునీటిపై ఆశలను పదిలపరిచింది. సిరిసిల్ల మానేరు వాగుపై నిర్మించిన మిడ్ మానేరు ప్రాజెక్ట్ కాళేశ్వరం
పొంగిన ఎగువ మానేరు ప్రాజెక్ట్
రైతుల్లో వెల్లివిరిసిన ఆనందం
32 వేల క్యూసెక్కుల నీరు దిగువ మానేరుకు
నాలుగేళ్లకు సిరిసిల్ల మానేరు వాగు తీరానికి జలకళ
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ఎగువ మానేరు పొంగింది. రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. సాగునీటిపై ఆశలను పదిలపరిచింది. సిరిసిల్ల మానేరు వాగుపై నిర్మించిన మిడ్ మానేరు ప్రాజెక్ట్ కాళేశ్వరం జలాలతో జలకళ సంతరించుకున్నా మానేరు వాగు తీర ప్రాంతాలు మాత్రం వెలవెలబోతూ వచ్చాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 9వ ప్యాకేజీలో ఎగువ మానేరు ప్రాజెక్ట్లో నీటిని నింపే పనులు నడుస్తున్నా ఎప్పటికి పూర్తవుతాయో తెలియక రైతులు నిరీక్షిస్తున్నారు. ప్రాజెక్ట్ ప్యాకేజీ పనులు ఎలా ఉన్నా నాలుగేళ్ల తర్వాత నిజాం కాలంలో నిర్మించిన గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్ట్ అల్పపీడన ప్రభావంతో 32 ఫీట్లు నిండి శుక్రవారం మత్తడి దూకింది. దీంతో ఎగువ మానేరు నుంచి మిడ్ మానేరు వరకు మానేరు వాగు తీరం రైతులు, ప్రజలు అనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ నుంచి మానేరు వాగులో పరవళ్లు తొక్కుతూ దిగువమానేరు ప్రాజెక్ట్లోకి వెళ్లే దృశ్యాలను చూడడానికి సందర్శకులు ఉత్సాహం చూపుతున్నా కరోనా ఎఫెక్ట్తో ఆంక్షలు విధించారు.
ప్రాజెక్ట్ జలకళ సంతరించుకున్న ప్రతీసారి సిరిసిల్లలోని వివిధ ప్రాంతాలతోపాటు కామారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చేవారు. 2016 సెప్టెంబరు తర్వాత మళ్లీ ఎగువ మానేరు ప్రాజెక్ట్ జలకళ వచ్చింది. అంక్షలతో ఎవరూ రాలేని పరిస్థితి ఏర్పడింది. సిరిసిల్ల నియోజకవర్గం మెట్ట ప్రాంత రైతాంగానికి కల్పతరువుగా ఉన్న నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు ఎప్పుడూ వర్షాభావ పరిస్థితుల్లో తడారిపోతోంది. పాలకులు చేపట్టిన ఎత్తిపోతల పథకాలు నత్తనడకన సాగుతున్నా వరుణుడి కరుణతో రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లకోసారైనా నిండుతోంది. ఒకసారి ఎగువ మానేరు ప్రాజెక్ట్ నిండి నీటి ప్రవాహంతో మానేరు వాగు పరవళ్లుతొక్కడంతో మరో రెండేళ్ల వరకు తాగు, సాగు నీటికి ఇబ్బంది లేదని ప్రజలు భావిస్తారు. మానేరు వాగు పరిహహక ప్రాంతంలోని బోరు బావులు కూడా ఎండిపోకుండా రైతుల ఎవుసానికి సాయంగా ఉంటుంది.
జిల్లాలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లోని 14వేల 500 ఎకరాలకు సాగు నీరందించడానికి నిజాంలు నిర్మించిన ఎగువ మానేరు ప్రాజెక్టు తడారిపోయిన దృశ్యాలను చూస్తూ రైతాంగం తల్లడిల్లిపోయారు. ఈ ఏడాది కూడా ఎగువమానేరుకు ఎడారి తప్పదని భావించారు. ఈ సారీ ఎగువ మానేరుపై రైతులు ఆశలు చాలించుకుంటున్న తరుణంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూడెల్లి, పాల్వంచ వాగులు పరుగులతో వచ్చి ఎగువమానేరు ప్రాజెక్ట్ పరవళ్లు తొక్కించాయి. టీఎంసీల సామర్థ్యం, 32 ఫీట్ల నీటి నిల్వతో గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలకు సాగు నీరు, సిరిసిల్ల, ఇల్లంతకుంట మండలాలకు తాగునీటికి ఉపయోగ పడే ఎగువ మానేరు ప్రాజెక్టుకు జల కళ తేవడానికి ప్రాణహిత చేవెళ్ల ఎత్తి పోతల పథకానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి శంకుస్థాపన చేసినా ఇప్పటల్లో జలకళ వచ్చే పరిస్థితులైతే కనిపించడం లేదు.
ఆ తర్వావత 2009లో మిడ్ మానేరు నుంచి ఎగువ మానేరుకు తొమ్మిదో ప్యాకేజీలో పనులు ప్రారంభించినా నత్తనడకన సాగుతున్నాయి. భారీ వర్షాలతో ప్రాజెక్ట్ నిండుతూ కొంత ఊరటనిస్తోంది. సిద్దిపేట, కామారెడ్డి సరిహద్దుల్లోని సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద 1945 - 51లో మెదక్ జిల్లా కూడవెళ్లి, నిజామాబాద్ జిల్లా పాల్వంచ వాగుల వరద నీటి ఆధారంగా చేసుకొని నిజాం ప్రభుత్వం ఎగువ మానేరును నిర్మించింది. ఏడో ఆఖరు నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆ కాలంలోనే కోటి 13లక్షలతో ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు మాన్సూన్ రేన్పాల్ 28.9 ఇంచులు ఉండగా 10 వేల 700 అడుగుల పొడవు కట్ట, 2717స్పిల్వేతో నాలుగు చదరపు మైళ్ల విస్తీర్ణం, 32ఫీట్ల ఎత్తుతో రిజర్వాయర్లో నీర్లు నిల్వ ఉండేట్లు నిర్మించారు.
ప్రాజెక్టు పరిస్థితి పరిశీలిస్తే
ప్రాజెక్టులోకి 1991లో కేవలం 12ఫీట్లు నీరు చేరడంతో 3వేల ఎకరాలు మాత్రమే సాగయ్యేవి. ఆ పరిస్థితి 1993 వరకు కొనసాగినా 1994, 1995లో తుఫాన్ ఫలితంగా ప్రాజెక్టులోకి నీరు చేరింది. 1996, 1997లో తీవ్ర వర్షాభావం మళ్లీ వెంటాడింది. 1998లో కురిసిన వర్షాలు రైతన్నలకు కొంత ఊరటనిచ్చాయి. ప్రాజెక్టులోకి ఒకసారి కాక పోయినా ఒకసారైనా నీరు చేరి రైతన్నకు అన్నం పెట్టింది. కానీ ఎగువ మానేరుకు ఆధారంగా జలాశయం క్యాచ్ మెంట్ ఏరియా అయిన కూడవెళ్లి వాగుపై చెక్డ్యామ్లు, ఫీడర్ ఛానళ్ల నిర్మాణంతో ప్రాజెక్టులోకి నీరు రాక పూర్తిగా ఎండిపోయింది.
మెదక్ జిల్లాలో పలు గ్రామాల పరిధిలోని వాగులపై నిర్మాణాలు జరిగాయి. దీంతో మానేరులోకి నీళ్లు చేరకుండా పోయాయి. 1997 నుంచి 2007 వరకు మానేరు వాగుకు జలకళ లేకుండా పోయింది. 2007, 2008లో ఆగస్టులో అల్పపీడనంతో కురిసిన వర్షాలకు మానేరులో జలకళ వచ్చినా 2009లో వర్షాభావ పరిస్థితుల్లో పూర్తిగా ఎండిపోయింది. మళ్లీ 2010, 2012లో కొంత మేర నీరు చేరింది. 2013లో మళ్లీ జలకళ సంతరించుకుంది. 2014, 2015 కరువు పరిస్థితులు చూసిన రైతులకు 2016లో మత్తడి దూకి ఊరటనిచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్ట్ పొంగి పొర్లడం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్ట్ వద్ద ఆంక్షలు
ఎగువ మానేరు ప్రాజెక్ట్ నిండి మత్తడి దూకుతుండడంతో అధికారులు ముందస్తుగా అంక్షలు విధించారు. ప్రాజెక్ట్ వద్ద సెల్ఫీలను, పరిసరాల్లో మద్యపానాన్ని నిషేధించారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో మత్తడి దూకే ప్రాంతంలో సందర్శకులను తిరగనివ్వకుండా చర్యలు చేపట్టారు.
Updated Date - 2020-08-22T11:13:58+05:30 IST