యూరియా ధరలపై నియంత్రణ కరువు
ABN, First Publish Date - 2020-08-22T11:15:36+05:30
జిల్లాలో యూరియా ధరలపై నియంత్రణ కరువయ్యింది. యూరియా కొరత ఉందనే సాకుతో ఎమ్మార్పీకి మించి వ్యాపారులు విక్రయిస్తూ రైతులను నిలువు దోపిడీ
ఎమ్మార్పీకి మించి విక్రయాలు
నిలువు దోపిడీకి గురవుతున్న రైతులు
కొరత ఉందంటూ అధిక ధరకు విక్రయం
పట్టించుకోని వ్యవసాయ శాఖాధికారులు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో యూరియా ధరలపై నియంత్రణ కరువయ్యింది. యూరియా కొరత ఉందనే సాకుతో ఎమ్మార్పీకి మించి వ్యాపారులు విక్రయిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్కో బస్తాను 300 నుంచి 310 రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ధర 266 రూపాయలకు విక్రయించాల్సి ఉండగా, అదనంగా ఒక బస్తాపై 34 రూపాయలు దోచుకుంటున్నారు. ఈ వ్యవహారంపై వ్యవసాయ శాఖాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఎప్పటికప్పుడు హోల్సేల్, రిటెయిల్ ఎరువుల దుకాణాలను సందర్శించి ఎమ్మార్పీ ధరలకు యూరియాను విక్రయిస్తున్నారా, లేదా అని పరిశీలించాల్సిన వ్యవసాయ శాఖాధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీంతో హోల్సేల్, రిటెయిల్ ఎరువులు, క్రిమిసంహారక మందుల వ్యాపారులు ఇష్టారాజ్జంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
పెరిగిన సాగు విస్తీర్ణం..
రాష్ట్రంలో ఈ వానాకాలంలో సాగు విస్తీర్ణం పెరగడంతో ఎరువుల వాడకం పెరిగిపోయింది. కాంప్లెక్స్, అమ్మోనియా, పొటాష్ ఎరువులు అందుబాటులో ఉన్నప్పటికీ యూరియాను మాత్రం అమ్మకాలను బట్టి సరఫరా చేస్తున్నారు. యూరియాను కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున సబ్సిడీపై రైతులకు విక్రయిస్తున్నది. 45 కిలోల యూరియా బస్తా తయారీకి 700 రూపాయలకు పైగానే అవుతుంది. రైతులకు మాత్రం 266 రూపాయలకు మాత్రమే విక్రయించాలని ప్రభుత్వం నిర్ధేశించింది. సబ్సిడీ సొమ్ములను ఆయా కంపెనీలకు చెల్లిస్తున్నది. జిల్లాలో నాగార్జున, స్పిక్, క్రిభ్కో, కిసాన్, విజయ, ఆర్సీఎఫ్ యూరియాను విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఇద్దరు హోల్సేల్ డీలర్లతో పాటు కరీంనగర్లోగల హోల్సేల్ డీలర్ల ద్వారా యూరియాను సరఫరా చేస్తున్నారు. నాగార్జున యూరియా ఉమ్మడి జిల్లాలో చాలామంది డీలర్లు ఉన్నారు. హోల్సేల్ డీలర్లకు ఆయా కంపెనీలను బట్టి 238 నుంచి 242 రూపాయల వరకు యూరియాను సరఫరా చేస్తూ ఉంటాయి.
సదరు వ్యాపారులు రిటెయిల్ వ్యాపారులకు బస్తాపై 2, 3 రూపాయల లాభం చూసుకుని విక్రయించాల్సి ఉంటుంది. అయితే హోల్సేల్ వ్యాపారులు యూరియా కొరత ఉందనే సాకుతో రిటైల్ వ్యాపారులకు ఒక్కో బస్తాను 270 నుంచి 285 రూపాయలకు విక్రయిస్తున్నారని సమాచారం. బిల్లులు మాత్రం తక్కువ ధరకే ఇస్తున్నారని తెలుస్తున్నది. రిటైల్ వ్యాపారులు రవాణా, హమాలీ చార్జీలు కలుపుకుని ఒక బస్తాను 300 నుంచి 310 రూపాయల వరకు రైతులకు విక్రయిస్తున్నారు. వీటి అమ్మకాల వల్ల రిటైల్ వ్యాపారులకు పెద్దగా లాభాలు లేకున్నప్పటికీ ఎప్పటికీ తమ వద్దకే ఎరువులు, క్రిమిసంహార మందులు, విత్తనాల కొనుగోలు కోసం వచ్చే రైతుల గిరాకీని వదులుకోలేక యూరియాను విక్రయిస్తున్నారు. యూరియా విక్రయాల్లో లాభం లేకపోయినా, రవాణా, హమాలీ చార్జీలు కలుపుకుని వచ్చిన ధరకే కొందరు విక్రయిస్తున్నారు.
ప్రాథమిక సహకార సంఘాలే మేలు..
ప్రాథమిక సహకార సంఘాల్లో మాత్రం ఒక బస్తాను 270 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. హోల్సేల్ డీలర్లను కట్టడి చేయని కారణంగా రైతులపై తీరని భారం పడుతున్నది. జిల్లా అవసరాల కోసం ఈ సీజన్కు 32,983 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. జిల్లాకు సరఫరా అవుతున్న యూరియాను మార్క్ఫెడ్కు 50 శాతం, ప్రైవేట్ రిటైల్ ఎరువుల వ్యాపారులకు 50 శాతం కోటాను కేటాయిస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు కేటాయిస్తున్న యూరియాను రైతులకు ఎమ్మార్పీకి మించి అమ్ముతున్నారు. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. దీనిపై జిల్లా అధికారులు స్పందించి యూరియా ధరలను నియంత్రించాలని, అవసరమైతే ప్రైవేట్కు కోటాను తగ్గించి మార్క్ఫెడ్కు పెంచాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - 2020-08-22T11:15:36+05:30 IST