రగులుతున్న ‘సన్నాల’ పోరు
ABN, First Publish Date - 2020-11-13T10:04:18+05:30
సన్న రకం వడ్లు పండించిన రైతుల పోరు తీవ్రరూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన రైతులే కాకుండా అధికారపార్టీకి చెందిన రైతులు కూడా ఈ డిమాండ్కు మద్దతు పలుకుతున్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్లో
ప్రగతిభవన్ ముట్టడికి వెళ్తారని 26 మంది అరెస్టు
కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ మహా ధర్నా
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణపై కేసు నమోదు
టీడీపీ అధ్యక్షుడు జోజిరెడ్డి హైదరాబాద్లో అరెస్టు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
సన్న రకం వడ్లు పండించిన రైతుల పోరు తీవ్రరూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన రైతులే కాకుండా అధికారపార్టీకి చెందిన రైతులు కూడా ఈ డిమాండ్కు మద్దతు పలుకుతున్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్లో అధికారపార్టీకి చెందిన వారే జడ్పీటీసీలుగా ఉండగా సన్నరకం వరికి 2,500 మద్దతు ధర చెల్లించాలని తీర్మానం చేశారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
కాంగ్రెస్ పార్టీ సన్నరకాల వరిసాగు చేసిన రైతులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ ఎదుట మహాధర్నానుచేపట్టింది. ఇందులో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించగా భారీ స్పందన లభించింది. ఈ సందర్శంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ధర్నాకు హాజరైన రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు కలెక్టరేట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొంత తోపులాట జరిగింది. ఈనేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారని పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి సత్యనారాయణలతోపాటు కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జి బొమ్మ శ్రీరాంచక్రవర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
టీడీపీ ఆధ్వర్యంలో..
తెలుగుదేశం పార్టీ ఆదేశం మేరకు ప్రగతి భవన్ కార్యక్రమానికి వెళ్లిన కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డిని హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రగతిభవన్ ముట్టడికి మద్దతుగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త కల్యాడపు ఆగయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యాలయంలో మౌన దీక్ష చేపట్టారు. పలు మండలాల్లో టీడీపీ కార్యకర్తలు మౌనదీక్షలు నిర్వహించారు.
రెతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో..
ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి వెళ్తారన్న సమాచారంతో జిల్లావ్యాప్తంగా 26 మంది రైతు ఐక్య వేదిక నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రగతిభవన్ ముట్టడి కోసం నిర్వహించిన ముందస్తు సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, రైతులతోపాటు టీఆర్ఎస్కు చెందిన కొందరు రైతులు పాల్గొన్నారని సమాచారం.
టీఆర్ఎస్లోనూ డిమాండ్..
జిల్లాలో అధికారపార్టీకి చెందిన రైతుల నుండి కూడా సన్న రకాల వరి ధాన్యానికి క్వింటాల్ 2,500 రూపాయల చెల్లించాలనే డిమాండ్ బలంగా వస్తున్నది. జిల్లావ్యాప్తంగా రైతుల నుంచి భారీ స్పందన వస్తుండడంతో అన్ని రాజకీయ పక్షాలు ఈ అంశంపై దృష్టిసారించాయి.
బీజేపీ ఆధ్వర్యంలో..
భారతీయ జనతా పార్టీ ఈనెల 11న కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టింది. ఆ పార్టీ జాతీయ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది.
ఉద్యమానికి కార్యాచరణ
కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ, రైతు ఐక్యవేదికలు ఈ అంశంపై అన్ని మండలాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి తమ డిమాండ్కు సానుకూల స్పందన లభించే వరకు ఉద్యమాన్ని ఉదృతం చేయాలని బావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఐక్యవేదిక పేరిట గ్రామాల్లో వెళ్లాలా, ఎవరంతటా వారు ఆందోళన చేపట్టాలన్న విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. అన్ని పక్షాల వారు సన్న వరి ధాన్యం పండించిన రైతులకు అండగా నిలవాలనే విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా తమకు బోనస్ ప్రకటించి 2,500 క్వింటాల్ చొప్పున కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వరి కోతలు ముమ్మరమై ఇప్పటికే సగం కోతలు పూర్తయినందు వల్ల ఆ ధాన్యం ఎక్కడ నిలువ ఉంచుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
సన్న రకాలకు ధర వ్యవహారం తేలక పోవడంతో రైతులు అటు మార్కెట్కు ధాన్యం తీసుకురాలేక, ఇటు ఇంట్లో నిలువ ఉంచుకునే పరిస్థితులు లేక ఆందోళనచెందుతున్నారు. సన్నరకాల సాగుతో ఎకరాకు 8 వేల రూపాయల చొప్పున నష్టపోవాల్సి వచ్చిందని, రైతుబంధు ద్వారా 10వేల రూపాయలు ఇచ్చినా లాభం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని సన్న రకం వరి ధాన్యానికి బోనస్ ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రైతుల ఆందోళన ఉధృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Updated Date - 2020-11-13T10:04:18+05:30 IST