సీనియర్ ఫొటో జర్నలిస్టు సీఎన్ రావు మృతి
ABN, First Publish Date - 2020-02-22T07:54:45+05:30
సీనియర్ ఫొటో జర్నలిస్టు సి.నర్సింలు రావు శుక్రవారం ఢిల్లీలో మృతి చెందారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన ఎయిమ్స్లో చేరారు. కిడ్నీ వ్యాధితో ఆయన మృతి చెందినట్లు...
వెంకయ్య, కేసీఆర్ సంతాపం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): సీనియర్ ఫొటో జర్నలిస్టు సి.నర్సింలు రావు శుక్రవారం ఢిల్లీలో మృతి చెందారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన ఎయిమ్స్లో చేరారు. కిడ్నీ వ్యాధితో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామానికి చెందిన సీఎన్ రావు ఆంధ్రజ్యోతి, ఈనాడు, దైనిక్ జాగరణ్, పీటీఐ, ఆసియా వీక్, న్యూస్ టైమ్ వంటి పలు మీడియా సంస్థల్లో పనిచేశారు. పంజాబ్ ఉగ్రవాదులు కాంగ్రెస్ నేత మణీందర్ సింగ్ బిట్టాపై ఢిల్లీలో దాడి చేసిన ఘటనను లైవ్లో ఫొటోలు తీయడం ద్వారా ఆయన ఢిల్లీ ఫొటోగ్రాఫర్లలో పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. సీఎన్ రావు తనకు చాలా కాలంగా తెలుసని, ఉత్తమ ఫొటో జర్నలిస్టని కొనియాడారు. సీఎన్ రావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నాలుగు దశాబ్దాల పాటు జర్నలిజం రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీడీపీ నేత నారా లోకేశ్ తదితరులు సీఎన్ రావు మృతి పట్ల సంతాపం తెలిపారు.
Updated Date - 2020-02-22T07:54:45+05:30 IST