మెట్టుగుట్టపై జైనమత చిహ్నాలు
ABN, First Publish Date - 2020-12-29T04:42:06+05:30
మెట్టుగుట్టపై జైనమత చిహ్నాలు
లఘుశాసనం, ధర్మనాథుని పాదాలు, ప్రతిమ గుర్తింపు
హన్మకొండ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కాజీపేట మండలంలోని మడికొండ మెట్టుగుట్టపై జైన మత ప్రాభవ చిహ్నాలు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ జాగృతి చరిత్ర బృందం సభ్యుడు సముద్రాల సునిల్ సోమవారం వెల్లడించారు. గుట్టపైన ఓ లఘుశాసనంతో పాటు జైనమతానికి చెందిన ధర్మనాథుని ప్రతిమ, పాదాలను గుర్తించారు. ఈ లఘుశాసనంలో జినబ్రహ్మజోగి అని రాసి ఉంది. ఈ శాసనం పైభాగాన ధర్మనాథుని పాదాలు, ఆ పక్కన ధర్మనాథుని చిన్న విగ్రహం ఉంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట, మడికొండ ప్రాంతాల్లో జైనమత ప్రాభవం సాక్ష్యాలుగా ఎన్నో శిథిల జైనబసదులు(సత్రాలు), మందిరాలు, శిల్పాలు కనిపిస్తాయి. రాష్ట్రకూటుల కాలంలో ఈ ప్రాంతాన్ని ఏలిన కొలనుపాక మహామండలేశ్వరుడు శంకరగండరస (క్రీ.శ 888) జైనబసదులు, జైనగుడులు నిర్మించిన ఆధారాలు ఉన్నాయి. ఆ సమయంలోనే మెట్టుగుట్ట మీద కూడా జైనబసది నిర్మాణం జరిగి ఉంటుందని సునిల్ అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే మెట్టుగుట్ట మీద జినబ్రహ్మజోగి లఘుశాసనం, ధర్మనాథుని ప్రతిమ, పాదాలు చెక్కి ఉండవచ్చునని అన్నారు. తెలంగాణలో ఆదినాథ, పార్శ్వనాథ, మహావీరులకు అనేకచోట్ల జైనబసదులు, గుడులు నిర్మించారు. నేమినాథ, శాంతినాథ, సుపార్శ్వనాథ, అరనాథ, శీతలనాధులకు అరుదుగా జైనబసదులు, విహారాలు కనిపిస్తాయి. ఆ కోవకు చెందినదే ఈ ధర్మనాథుని లఘుశానసం, ప్రతిమ అని వివరించారు.
Updated Date - 2020-12-29T04:42:06+05:30 IST