‘భవిష్యత్లో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీదే రాజ్యం’
ABN, First Publish Date - 2020-03-16T10:04:13+05:30
‘భవిష్యత్లో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీదే రాజ్యం’
ఎర్రగడ్డ, మార్చి15 (ఆంధ్రజ్యోతి): రాబోవుకాలంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీదే రాజ్యమని, రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మెరుగైన సేవలు అందిస్తామని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్, రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు చెన్నారెడ్డి తెలిపారు. ఆదివారం రాయల్ గార్డెన్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రథమ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని, స్కూళ్లలో ఉచిత విద్య, భోజనం, సౌకర్యాలు కల్పిస్తామని, కార్మికులు, కర్షకుల హక్కులను కాపాడుతామని, అసంఘటిత కార్మికులను ఏకతాటిపైకి తెస్తామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జి.నరేందర్ రెడ్డి, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సి.శోభారెడ్డి, రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ జి.మహేందర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జి మేకల ముదిరాజ్, కవిత, హీరాణి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-03-16T10:04:13+05:30 IST