నేటి నుంచి డిగ్రీ చివరి సెమిస్టర్
ABN, First Publish Date - 2020-09-22T07:37:47+05:30
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలు మంగళవారం నుంచి
హైదరాబాద్ సిటీ/ఉప్పల్, సెప్టెంబర్ 21 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఓయూలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, బీఈడీ, బీసీఏ తదితర కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను ప్రారంభించగా, కొవిడ్ నిబంధనలను పాటిస్తూ సజావుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదే తరహాలో డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలను కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ నిర్వహించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాట్లు చేసింది. విద్యార్థులకు దూరం, భారం తగ్గేందుకు ఏ కాలేజీలో చదివిన విద్యార్థులు ఆ కాలేజీలోనే పరీక్షలు రాసేలా వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలకు 57 వేల మంది హాజరవుతున్నారు.
దూర విద్యా పరీక్షలు కూడా...
ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్ రాంరెడ్డి దూరవిద్యా కేంద్రంలో బీఏ, బీకాం, బీబీఏ చివరి ఏడాది పరీక్షలు కూడా మంగళవారం నుంచి ప్రారంభమవ్వనున్నాయి. పరీక్షా కేంద్రాలుగా నిజాం కాలేజీ, కోఠి ఉమెన్స్ కాలేజీ, సికింద్రాబాద్ పీజీ కాలేజీలో నిర్వహించనున్నారు. చివరి ఏడాది పరీక్షలకు 1350 మంది విద్యార్థులు హాజరవ్వనుండగా, కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపడుతున్నారు.
Updated Date - 2020-09-22T07:37:47+05:30 IST